Telugu Global
International

వడగాడ్పులతో బ్రిటన్ విలవిల.. తాత్కాలిక ఎమర్జెన్సీ.. స్కూళ్ళు బంద్

40 డిగ్రీల ఎండలతో బ్రిటన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వారికి ఇబ్బందిగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ విధించింది.

వడగాడ్పులతో బ్రిటన్ విలవిల.. తాత్కాలిక ఎమర్జెన్సీ.. స్కూళ్ళు బంద్
X

ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాడ్పులతో బ్రిటన్ విలవిలలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. లండన్ లో బకింగ్ హామ్ ప్యాలస్ బయట దాహంతో అల్లాడుతున్న ఓ గార్డుకు ఓ వ్యక్తి బాటిల్ లో మంచినీళ్లు ఇస్తున్న తాజా ఫోటో వైరల్ అవుతోంది. లండన్ సహా అనేక చోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కి పైగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. యూరప్ దేశాల్లోని హీట్ వేవ్ బ్రిటన్ ను సైతం ఠారెత్తిస్తోంది. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు వడగాడ్పులతో సతమతమవుతున్నాయి. లండన్ లో మొదటిసారిగా ఎక్స్ ట్రీమ్ హీట్ వార్నింగ్ జారీ చేశారు. ఇంగ్లండ్ లోని అనేక చోట్ల సోమ, మంగళవారాల్లో తాత్కాలిక ఎమర్జెన్సీ ప్రకటించారు. అవసరమైతే దీన్ని పొడిగించే సూచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2019 జులై 25 న బ్రిటన్ లో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన తరువాత దాన్ని మించి ఈ ఏడాది సుమారు 40 డిగ్రీలు నమోదు కావడం విశేషం. ఫలితంగా దేశంలో కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా.. అనేక చోట్ల స్కూళ్లను మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లండన్ లోని మెట్రో నెట్ వర్క్ తాత్కాలికంగా స్పీడ్ పై ఆంక్షలు విధించింది.

ప్రజలు దూర ప్రాంత ప్రయాణాలు మానుకుంటే మంచిదని ప్రభుత్వం సలహా ఇస్తోంది. ఈ నెల 17 న సదరన్ యూరప్ అంతటా రేగిన వైల్డ్ ఫైర్స్ (కార్చిచ్చు) ప్రభావం కూడా బ్రిటన్ లోని నేటి పరిస్థితిపై పడింది. క్లైమేట్ చేంజ్ కారణంగా ఇలా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఇంగ్లండ్ లో ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చునని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. లెవెల్ రెడ్ అలర్ట్ అంటే నేషనల్ ఎమర్జెన్సీగా భావించవచ్చునని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

తీవ్రమైన వేడిగాలులు, వడగాడ్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. చివరకు ఇవి మరణానికి కూడా కారణమవుతాయని వారు వార్నింగ్ ఇచ్చ్చారు. హై రిస్క్ గ్రూపులవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. మరోవైపు బ్రిటన్ లో పందులకు కూడా వేడిగాలుల ప్రభావం సోకకుండా వాటికీ సన్ క్రీమ్ లోషన్ పూస్తున్నారంటే ఎండలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతోంది. ప్రత్యేక లోషన్లను పందులకు వాడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా వాటికీ ఈ లోషన్లు అప్లై చేయలేదని జంతు నిపుణులు పేర్కొనడం విశేషం.

,


First Published:  19 July 2022 3:47 AM GMT
Next Story