Telugu Global
International

చైనాను మరోసారి వణికిస్తోన్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో కేసుల నమోదు

Coronavirus in china: 2019 నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి ఒకేసారి 31,454 పాజిటివ్ కేసులు నమోదు కావడం చైనాలో ఇదే తొలిసారి. చైనాలో తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క బుధవారమే 29,390 పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది.

Coronavirus in China: చైనాను మరోసారి వణికిస్తోన్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో కేసుల నమోదు
X

Coronavirus in China: చైనాను మరోసారి వణికిస్తోన్న కరోనా.. కొత్తగా రికార్డు స్థాయిలో కేసుల నమోదు

కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాను మరోసారి వైరస్ వణికిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. అక్కడ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. కఠిన ఆంక్షలు అమలుకు ఆదేశాలు జారీ చేసింది. చైనాలో కొత్తగా 31,454 కరోనా కేసులు నమోయ్యాయని నేషనల్ హెల్త్ బ్యూరో ప్రకటించింది. అయితే వైరస్ సోకిన వారిలో 27,517 మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని ఆ సంస్థ తెలిపింది.

కాగా, 2019 నుంచి కరోనా వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి ఒకేసారి 31,454 పాజిటివ్ కేసులు నమోదు కావడం చైనాలో ఇదే తొలిసారి. చైనాలో తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క బుధవారమే 29,390 పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేషనల్ హెల్త్ బ్యూరో తెలిపింది. దీంతో కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చింది. అలాగే ప్రజల ప్రయాణాలపై ఆంక్షలు కూడా చేపట్టింది.

రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా చైనా ప్రభుత్వం వేగవంతం చేసింది. అలాగే పాఠశాలలను, రెస్టారెంట్లను, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అనవసరంగా బయట తిరగవద్దని చైనా ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ చైనాలో మాత్రం కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించింది. కొద్దిరోజులుగా అక్కడ రోజుకు 20వేల కేసులు నమోదు అవుతున్నాయి. చైనా రాజధాని బీజింగ్ లోని ఓ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు ఇటీవల మృతి చెందాడు. చైనాలో గడిచిన ఆరు నెలల తర్వాత వైరస్ కారణంగా మరణం సంభవించడం ఇదే తొలిసారి. దీంతో ఆ దేశ ప్రభుత్వం మరోసారి కరోనా కట్టడికి ఆంక్షలు విధిస్తోంది.

First Published:  24 Nov 2022 7:08 AM GMT
Next Story