Telugu Global
International

సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్, 55 మంది మృతి!

ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్‌’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్, 55 మంది మృతి!
X

సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మెరైన్, 55 మంది మృతి!

ఎల్లో సముద్ర జలాల్లో భారీ అణు ప్రమాదం చోటుచేసుకొంది. చైనాకి చెందిన ఓ సబ్‌మెరైన్ నడి సముద్రంలో చిక్కుకోవడంతో 55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శత్రు నౌకలను, సబ్ మెరైన్ లను అడ్డుకోవడానికి చైనా అమర్చిన ట్రాప్ తన సొంత నావికులనే బలి తీసుకుందన్న విషయాన్ని యునైటెడ్ నేషన్స్ ఇంటెలిజెన్స్ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో మొత్తం సబ్​మెరైనర్లు అందరు దుర్మరణం చెందారు. కానీ ఈ విషయాన్ని చైనా ప్రపంచం నుంచి దాచిపెట్టింది.

ఈ ఘటన జరిగిన నెల కావస్తున్నా చైనా నోరు మెదపలేదు. ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్‌’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అణు లీకులు ఏమైనా జరిగాయా అనే సందేహం ప్రపంచ దేశాల్లో మొదలైంది.

యూకే వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆగస్టు 21న స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 8:12 గంటలకు చైనాకు చెందిన అణుశక్తి సబ్ మెరైన్ 093-417 ట్రాప్‌లో చిక్కుకుంది. దీని ప్రభావంతో సబ్ మెరైన్ సిస్టం ఫెయిలైంది. ఆక్సిజన్‌ సిస్టమ్‌, ఎమర్జెన్సీ సమయంలో పని చేయాల్సిన సిస్టమ్‌ కూడా ఆఫ్ అయిపోయింది. మరమ్మతులు చేసి సబ్ మెరైన్‌ను ఉపరితలానికి తీసుకురావడానికి సుమారు ఆరు గంటలు పట్టింది. కానీ అప్పటికే లోపల ఉన్న 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు అందరూ విగతజీవులుగా మారిపోయారు. మొత్తం 55 మంది ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాతో పాటు అమెరికా మిత్ర దేశాల సబ్‌మరైన్స్‌ని ట్రాప్‌ చేసేందుకు చైనా నేవీ ఏర్పాటు చేసిన చైన్, లంగర్‌కి ఢీకొట్టింది సబ్‌మరైన్. అయితే చైనా మాత్రం ఇలాంటిదేమీ జరగలేదంటూ ఈ రిపోర్టును అధికారికంగా ఖండించింది.

First Published:  4 Oct 2023 8:40 AM GMT
Next Story