Telugu Global
NEWS

పేర్లు మారిస్తే.. చ‌రిత్ర మారుతుందా?

దిల్లీలోని రాజ్‌ప‌థ్‌ పేరును రేపటి నుంచి కర్తవ్యపథ్‌గా మోదీ మార్చేయబోతున్నారు. పేర్లు మార్చడంలో మోదీని మించినవారు ఎవరూ ఉండరు. దీన్ని గంభీరంగా చెప్పాలంటే నవనామ్నీకరణం అనొచ్చు.

పేర్లు మారిస్తే.. చ‌రిత్ర మారుతుందా?
X

"నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు; అలాగని కర్మలు చేయడం మానకు." ఇది గీతాకారుడు శ్రీకృష్ణపరమాత్మ అర్జునిడికి చేసిన హితబోధ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రకమైన హితబోధే చేస్తున్నారు. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమైనప్పుడు ప్రజలకు తమ కర్తవ్యాలను, బాధ్యతలను గుర్తు చేయడం మామూలే. అధికారంలో ఉన్నవారు తమ నిష్క్రియా పరత్వాన్ని గంప కింద కమ్మేయడానికి ఉన్న మార్గం ఇదొక్కటే కదా!

గురువారం దిల్లీలోని రాజ్‌ప‌థ్‌ పేరును రేపటి నుంచి కర్తవ్యపథ్‌గా మోదీ మార్చేయబోతున్నారు. పేర్లు మార్చడంలో మోదీని మించినవారు ఎవరూ ఉండరు. దీన్ని గంభీరంగా చెప్పాలంటే నవనామ్నీకరణం అనొచ్చు. ప్రస్తుతం రాజ్‌ప‌థ్‌ అంటున్నది బ్రిటిష్‌ హ‌యాంలో కింగ్స్‌వేగా ఉండేది. ఆ సమీపంలో ఇంతకుముందు క్వీన్స్‌ వే అని పిలిచే రోడ్డు పేరు స్వాతంత్య్రం అనంతరం జనపథ్‌గా మారిపోయింది. సార్వభౌమాధికారం ప్రజలదే అని సూచించడానికి ఆ రెండు రోడ్ల పేర్లూ మార్చారు. ప్రజలకు సార్వభౌమాధికారం ఉంటుందని, ఉండాలని మోదీ అనుకోరు కనక రాజ్‌ప‌థ్‌ పేరును కర్తవ్యపథ్‌గా మారుస్తున్నారు. ఈ పని చేయడానికి ముందు మోదీ శంఖంలో పోశారు.

దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చేత‌ పేరు మార్పు కోసం ఓ తీర్మానం చేయిస్తున్నారు. ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నకైంది కాదు. దాన్నిండా బీజేపీవారే ఉన్నారు. ఆ సమావేశం బుధవారమే జరుగుతుంది. తీర్మానం ఆమోదింప‌ చేస్తారు. రాజ్‌ప‌థ్‌ పేరును కర్తవ్యపథ్‌గా మార్చడంలో ఆంతర్యం హక్కుల కన్నా బాధ్యతలే ముఖ్యం అని చెప్పడం. పేర్ల మార్పుతో తంతు ముగియదు. అక్కడ సంప్రోక్షణ(శుద్ధిచేయడం) కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఐస్ క్రీమ్‌లు అమ్ముకునేలాంటివారిని అక్కడికి రానివ్వరు. ఆ ప్రాంతానికి సరదా పర్యటనలకు కూడా వినియోగించుకోనివ్వరు. మోదీ ప్రభుత్వ పనితీరు వల్ల ఇది ఆశ్చర్యకరమైంది కూడా కాదు. వీధులపేర్లు మార్చడం లాంటి వాటి వెనక ఓ దురుద్దేశం కూడా ఉంది.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉంటాయనుకుంటాం కనక ప్రజలు అవి సాధించుకోవడానికి పోరాడడం సహజం. ఈ హక్కుల్లో చాలా భాగం రాజ్యాంగం పూచీపడ్డవే. ఆ హక్కు లేకుండా చేయడమే అసలు ఆంతర్యం. అందుకే బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. పౌరులకున్న హక్కులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అన్న అంశాన్ని మోదీ సర్కారు ఎటూ ఖాతరు చేయదు. ఆ హక్కులను పరిరక్షించాలన్న ఉద్దేశం, చిత్తశుద్ధి బొత్తిగా లేదు. మోదీ వ్యవహారసరళిని బట్టి చూస్తే 2014కు పూర్వం అంతా శూన్యమే. అసలు చరిత్ర తన పాలనతోనే ప్రారంభమైందని మోదీ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ప్రజల హక్కుల కన్నా బాధ్యతల మీదే ఎక్కువ ఊనిక ఉండడంవల్ల ప్రభుత్వ బాధ్యతను విడనాడి ఆ భారం ప్రజల మీదే మోపాలన్న ప్రయత్నం సాగుతోంది.

ఇదంతా వలసవాద పాలన చరిత్రను తుడిచి పెట్టడానికే కనక ఇది మంచి పనేగా అని వాదించేవారు అసలు లక్ష్యాన్ని పరిగణించరు. వీధులపేర్లు మార్చే క్రమం నిజానికి 2016లోనే మొదలైంది. ప్రధాన మంత్రి నివాసం ఉండే వీధి పేరు రేస్ కోర్స్ రోడ్డు. కానీ దాన్ని లోక్ కల్యాణ్ మార్గ్ గా మార్చేశారు. బ్రిటిష్‌ ప‌రిపాలనలో దిల్లీ రేస్ కోర్స్ అక్కడ ఉండేది కనక దానికి రేస్ కోర్స్ రోడ్డు అన్నపేరు వచ్చింది. దిల్లీ రేస్ కోర్స్ క్ల‌బ్ 1940లో ఏర్పడినప్పటి నుంచే అది రేస్ కోర్స్ రోడ్డు అయింది. వీధుల పేర్లు ముఖ్యంగా ప్రధాన మంత్రి నివాసం ఉండే వీధి పేరు మన సంస్కృతికి అనుకూలంగా ఉండాలని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ దిల్లి మునిసిపల్ కార్పొరేష‌న్‌కు ఒక లేఖ రాశారు. ఆమె సూచించిన కొద్ది రోజులకే రేస్ కోర్స్ రోడ్డు కాస్తా లోక్ కల్యాణ్ మార్గ్ అయిపోయింది.

ఈ ఏడాది జనవరి 23న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ 125వ జ‌యంతి సందర్భంగా మోదీ ఇండియా గేట్‌ వ‌ద్ద బోస్‌ విగ్రహాన్నిఆవిష్కరించారు. ఆ సమయంలో మోదీ మాట్లాడుతూ స్వాతంత్య్రం తరవాత జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని అన్నారు. పైగా దీనికి మునుపటి ప్రభుత్వాల మీద విమర్శలు ఎక్కుపెట్టడానికి "అనేక మంది గొప్ప నాయకుల పేర్లు విస్మరించారు" అన్నఆరోపణ విసిరారు. దానితో పాటు జాతి వారసత్వాని, సంస్కృతిని తెర మరుగు చేశారని మోదీ అంటున్నారు. సుభాష్‌ చంద్రబోస్ రాసిన పుస్తకంలో చేసిన సూచన ఆధారంగా 2018 డిసెంబర్‌లో అండమాన్‌, నికోబార్‌ దీవుల పేర్లు మార్చేశారు. అండమాన్‌ ద్వీపానికి షహీద్‌ ద్వీపం అని, నికోబార్ దీవుల‌కు స్వరాజ్‌ ద్వీపం అన్నపేర్లు పెట్టాలని సుభాష్ చంద్ర‌బోస్‌ 1943లో సూచించారు. ఆయన చేసిన సూచనను అమలు చేయడానికి రాస్‌ ఐ లాండ్‌ను సుభాష్ చంద్ర‌బోస్‌ ద్వీపం అంటున్నారు. హేవలాక్ ఐలాండ్‌ను స్వరాజ్ ద్వీప్ అంటున్నారు.

పేర్ల మార్పు ప్రక్రియ జనతాపార్టీ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. అప్పుడు ఇర్విన్ ఆసుపత్రి ఇప్పుడు జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ ఆసుప‌త్రిగా, వెల్లింగ్డన్‌ ఆసుపత్రి రాం మనోహర్‌ లోహియా ఆసుపత్రిగా మారిపోయాయి. జనతా పార్టీ ఏలుబడిలో నేరౌజ్ అవెన్యూ కాస్త దీన్‌ ద‌యాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌గా మారిపోయింది. ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్‌ సిద్ధాంతకర్త. జనతా పార్టీలో ఆ సమయంలో జనసంఘ్‌ కూడా భాగస్వామి. ప్రస్తుతం ఎదురులేకుండా ఉన్న బీజేపీ పేర్లు మార్చేటప్పుడు ఏమాత్రం వెనకాముందు ఆలోచించడం లేదు. మోదీ ఇజ్రాయిల్‌ ప‌ర్యటన సందర్భంగా దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ తీన్మూర్తి మార్గ్, తీన్మూర్తి చౌక్‌ పేరు మార్చి ఇజ్రాయిల్‌లోని హైఫా నగరం పేరును ఆ మార్గాలకు పెట్టేసింది. డ‌ల్హౌసి రోడ్ దారాషికో రోడ్‌గా అవతారమెత్తింది. దారాషికో షాజహాన్‌ పెద్దకొడుకు. దారాషికో అంటే సంఘ్ ప‌రివార్‌వారికి చాలా ప్రీతిపాత్రమైంది. చరిత్ర లేనివారు పేర్లు మార్చి కొత్త చరిత్ర సృష్టించి సంతృప్తిపడుతూ ఉంటారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత కూడా పేర్లు మారినవి ఉన్నాయి. 1960లు, 1970లలో బ్రిటిష్‌ పాలన జ్ఞాపకాలను తుడి చేయడానికి అనేక పేర్లు మార్చేశారు.

First Published:  7 Sep 2022 11:05 AM GMT
Next Story