Telugu Global
NEWS

పవన్‌ విషయంలో `ఏమో` అంటూ మాట్లాడిన చిరంజీవి

పవన్‌ విషయంలో `ఏమో` అంటూ మాట్లాడిన చిరంజీవి
X

గాడ్‌ ఫాదర్ ప్రీ రిలీజ్ మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవి.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. అనంతపురం ఈవెంట్‌లో తానేమీ ప్రస్తుత రాజకీయాలపైనా, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల మీద ఎలాంటి సెటైర్లు వేయలేదన్నారు. కేవలం సినిమాలోని డైలాగులు మాత్రమే చెప్పానన్నారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని కూడా వ్యాఖ్యానించారు. కథ ఆధారంగా మాత్రమే డైలాగులు రాశారని వివరించారు.

పవన్‌ కల్యాణ్ రాజకీయ జీవితంపైనా చిరంజీవి స్పందించారు. పవన్ కల్యాణ్ స్థాయి ఏంటి అన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్‌గా ఉన్నానని.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటేనే పవన్‌కు లాభం ఉంటుందేమో అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి నిబద్ధత, నిజాయితీ ఉన్ననాయకుడు కావాలని.. అలాంటి అవకాశం పవన్‌ కల్యాణ్‌కు ప్రజలిస్తారేమో చూడాలన్నారు. పవన్‌ కల్యాణ్ భవిష్యత్తులో ఏ పక్షాన, ఎక్కడ ఉంటారన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అలాంటి వ్యక్తి రావాలన్నదే తన ఆకాంక్ష అని అందుకు తప్పనిసరిగా సపోర్టు ఉంటుందంటూ స్పష్టత లేకుండా చిరంజీవి మాట్లాడారు. ఇద్దరం వేర్వేరు పక్షాన ఉండడం కంటే తాను తప్పుకుని మౌనంగా ఉండడం వల్ల అతడు ఎమర్జ్ అవుతారేమో.. ప్రజలు పాలించే అవకాశం ఇస్తారేమో చూడాలని.. అలాంటి రోజు రావాలని తాను కోరుకుంటున్నానని చిరంజీవి చెప్పారు.

First Published:  4 Oct 2022 10:33 AM GMT
Next Story