Telugu Global
Health & Life Style

అధిక బ‌రువు, అధిక బీపీ వ‌ల్ల కూడా క్యాన్స‌ర్ ముప్పు - భారీ సంఖ్య‌లో పెరుగుతున్న కేసులు

ప్ర‌ధానంగా ఈ ప‌రిశోధ‌న‌లో శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగిన‌ట్టు వెల్ల‌డైంద‌ని జ‌ర్న‌ల్ పేర్కొంది. రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు, ఉదర క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయ‌ని వివ‌రించింది.

అధిక బ‌రువు, అధిక బీపీ వ‌ల్ల కూడా క్యాన్స‌ర్ ముప్పు  - భారీ సంఖ్య‌లో పెరుగుతున్న కేసులు
X

గ‌తంతో పోలిస్తే క్యాన్స‌ర్ కేసులు భారీ సంఖ్య‌లో పెరుగుతున్నాయ‌ని స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు చేసిన అధ్య‌య‌నం వెల్ల‌డిస్తోంది. ఆ వివ‌రాల‌ను ప్ర‌ముఖ జ‌ర్న‌ల్ బీఎంజే ఆంకాల‌జీ తాజాగా తెలియ‌జేసింది. 50 ఏళ్లలోపు వారిలో కొత్తగా క్యాన్సర్ బారినపడిన వారి సంఖ్య 79 శాతం పెరిగిందని, దీనిని బ‌ట్టి దీని తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. గ‌త 30 ఏళ్ల‌కు సంబంధించి చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డైన‌ట్టు తెలిపింది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, అధిక బీపీ కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

ప్ర‌ధానంగా ఈ ప‌రిశోధ‌న‌లో శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగిన‌ట్టు వెల్ల‌డైంద‌ని జ‌ర్న‌ల్ పేర్కొంది. రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు, ఉదర క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయ‌ని వివ‌రించింది. 1990 నుంచి శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నాయ‌ని తెలిపింది. తక్కువ వయసులోనే గుర్తించిన క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ కేసులు 2019లో అత్యధికంగా నమోదైనట్లు వెల్లడించింది.

అంతేకాదు.. తక్కువ వయసులో క్యాన్సర్ వచ్చే అవ‌కాశాలు 2030 నాటికి 31 శాతానికి పెరుగుతాయ‌ని అధ్యయనం పేర్కొంది. సంబంధిత మరణాల సంఖ్య కూడా 21 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. 40లలో ఉన్న వారికి ఈ ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. లివ‌ర్ క్యాన్స‌ర్ కేసుల న‌మోదు మాత్రం త‌గ్గుతున్నాయ‌ని, అది ఏటా దాదాపు 2.88 శాతం చొప్పున త‌గ్గుతోంద‌ని వివ‌రించింది.

2019లో 10 ల‌క్ష‌ల మందికి పైనే మృతి

ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్ వల్ల 2019లో పది లక్షల మందికి పైగా మరణించారని ఈ అధ్యయనం తెలిపింది. 1990తో పోలిస్తే ఈ సంఖ్య 28 శాతం పెరిగినట్లు వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధిక మంది శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ఉదరం, పేగు క్యాన్సర్‌తో మరణిస్తున్నార‌ని తెలిపింది. కిడ్నీ, అండాశయ క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది.

క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టానికి కారణాలేంటంటే..

అస‌లు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టానికి గ‌ల కార‌ణాలేమిట‌నే విష‌యంపై ఈ అధ్య‌య‌నం వివ‌రిస్తూ.. జ‌న్యుప‌ర‌మైన అంశాలు ఒక కార‌ణంగా తెలిపింది. రెడ్ మీట్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం క్యాన్సర్ ముప్పును పెంచే కారకాల్లో ఒకటని పేర్కొంది. ఆల్కహాల్, పొగాకు కూడా క్యాన్సర్‌కు దారితీస్తాయ‌ని.. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, అధిక బీపీ కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయ‌ని ఈ అధ్య‌య‌నం వివ‌రించింది.

First Published:  6 Sep 2023 9:17 AM GMT
Next Story