Telugu Global
Health & Life Style

దేశంలో 74శాతం మంది పోషకాహారాన్ని కొనలేకపోతున్నారు

మనదేశంలో ఇప్పటికీ 74శాతం మంది ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం లభించడం లేదని ‘ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యుట్రిషన్ ఇన్ ద వరల్డ్’ 2023 నివేదిక వెల్లడించింది.

దేశంలో 74శాతం మంది పోషకాహారాన్ని కొనలేకపోతున్నారు
X

మనదేశంలో ఇప్పటికీ 74శాతం మంది ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం లభించడం లేదని ‘ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యుట్రిషన్ ఇన్ ద వరల్డ్’ 2023 నివేదిక వెల్లడించింది. బ్రిక్స్ దేశాలు... బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాలతోనూ, ఇందులో కొత్తగా చేరిన ఆరు దేశాలతో, భారత్ కి ఇరుగుపొరుగుదేశాలన్నింటితో పోల్చినప్పుడు ఈ విషయంలో భారతే దిగువన ఉంది.

ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం ధరలు భారతదేశంలో చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతున్నాయి. అయినా సరే బ్రిక్స్ దేశాల్లోని ఆహారపు ధరల కంటే అవి తక్కువగానే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఆదాయ పెరుగుదల తక్కువగా లేదా స్థిరంగా ఉండటం వలన ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం కోసం పెట్టగల ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది.

‘ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యుట్రిషన్ ఇన్ ద వరల్డ్’ 2023 అందిస్తున్న డాటాని బట్టి ఐదేళ్లలో ముంబయిలో భోజనం ధర 65శాతం పెరిగింది. కాగా జీతాలు వేతనాలు మాత్రం 28నుండి 37శాతం వరకు మాత్రమే పెరిగాయి. ముంబయి నుండి స్థిరంగా గణాంకాలు లభ్యమవుతున్నందున దీనిని ఎంపిక చేసుకున్నారు. అంటే భారత్ లో ఆరోగ్యకరమైన ఆహారపు ధరలు బాగా పెరుగుతున్నాయి. అయితే ఆహారంపై ఖర్చుపెట్టగల స్థోమత ఉన్నవారు కూడా తగిన స్థాయిలో ఆహారం కోసం ఖర్చు చేయటం లేదని తెలుస్తోంది.

స్థానికంగా లభించే చవకైన, ఆరోగ్యకరమైన, ఆహారపరమైన మార్గదర్శకాలకు లోబడి ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకుని వాటి ధరల ఆధారంగా... ఆరోగ్యకరమైన ఆహార ధరలను నిర్ణయించారు. ప్రతి దేశపు సగటు ఆదాయంతో ఆహారపు ధరని పోల్చి చూసి ఆ పదార్థపు ధరలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి అనేది నిర్ణయించారు. ఒక దేశపు సగటు ఆదాయంలో 52శాతానికి మించి ఆహారపు ధర ఉంటే అలాంటి ఆహారాన్ని ఖరీదైన ఆహారంగా పరిగణించారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల ప్రజలు తమ ఆదాయంలో యాభైరెండు శాతం డబ్బుని ఆహారంపైన పెడితే కానీ అది అందుబాటులో లేకపోవడాన్ని ఆధారంగా చేసుకుని... ఆదాయంలో యాభై రెండు శాతం ఆహారం పైన పెడితే అది ఖరీదైన ఆహారమని నిర్ణయించారు. దేశంలో ఉన్న ప్రజల ఆదాయ పంపిణీలను ఆధారం చేసుకుని ... ఎంతమంది తమ ఆదాయంలో 52శాతాన్ని ఆహారంపైన ఖర్చు చేయలేకపోతున్నారనేది గుర్తించారు.

2021లో ప్రపంచ బ్యాంకు అందించిన వివరాల ప్రకారం భారతదేశంలో పర్ పర్సన్ పర్ డే డాలర్లు 3.066. అంటే మనదేశంలో రోజుకి ఒక మనిషి ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఖర్చు చేస్తున్నది 3.066 డాలర్లన్నమాట. ఇది ఇంతకుముందు మనం పేర్కొన్న అన్ని దేశాల్లో కంటే తక్కువగా ఉంది. కొనుగోలు శక్తిలో ఉన్న అసమానతలను బట్టి ఏ దేశంలో ఆహారపు ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఏ దేశపు ప్రజలు తక్కువ డబ్బుని ఆహారంపైన ఖర్చు చేస్తున్నారు... అనే అంశాలను లెక్కించారు. ఉదాహరణకు అమెరికాలో ఒక్క డాలరుకి ఎంత ఆహారం వస్తుందో అంతే ఆహారం భారత్ లో, బ్రెజిల్ లో కూడా రావాలి. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం అంత డబ్బుతోనే అందుబాటులోకి రావాలి. దీనిని బట్టి దేశాల మధ్య కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఉన్న తేడాలను సైతం లెక్కించారు. మొత్తానికి 2021లో మనదేశంలోని జనాభాలో 74శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనలేకపోయారని గణాంకాలు చెబుతున్నాయి.

First Published:  1 Sep 2023 2:13 AM GMT
Next Story