Telugu Global
CRIME

కారణాలు చిన్నవి.. కానీ ప్రాణాలే తీసుకుంటున్నారు

తల్లిదండ్రులు కోప్పడతారన్న భయంతో హేమలత హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉంగరం పోవడంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సూసైడ్ లెటర్ లో కూడా రాసింది.

కారణాలు చిన్నవి.. కానీ ప్రాణాలే తీసుకుంటున్నారు
X

గతంతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ చాలా సున్నితంగా మారింది. చిన్న చిన్న విషయాలకే పిల్లలు మనస్తాపం చెందుతున్నారు. వాటిని ఎదుర్కొందాం.. ఏదైతే అదైంది.. అని ఆలోచించడం లేదు. ఆవేశంలో, బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా చిన్నచిన్న కారణాలతో ఇద్దరు బాలికలు ప్రాణాలు తీసుకున్నారు. వరంగల్ జిల్లా గున్నేపల్లికి చెందిన జానకీ రామ్ కూతురు హేమలత హన్మకొండలోని హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది.

కాగా, హేమ‌ల‌త‌ ఇటీవల ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఓ బంగారు ఉంగరం పోగొట్టుకుంది. విషయం ఇంట్లో కూడా చెప్పకుండా సెలవుల తర్వాత తిరిగి హాస్టల్ కి వెళ్ళింది. బంగారు ఉంగరం పోయిందని తెలిస్తే తల్లిదండ్రులు కోప్పడతారన్న భయంతో హేమలత హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉంగరం పోవడంతోనే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సూసైడ్ లెటర్ లో కూడా రాసింది.

మరో ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తిరువల్లూరు జిల్లా పెరియకుప్ప గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి ప్రతీషా(9) అనే కూతురు ఉంది. ఈ చిన్నారి నాలుగో తరగతి చదువుతోంది. కొంతకాలంగా ప్రతీషా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తోంది. అది ఇటీవల వ్యసనంగా మారి ఇప్పటివరకు 50 వీడియో రీల్స్ చేసింది. చదువు పక్కనపెట్టి ఇలా రీల్స్ ఎందుకు చేస్తున్నావు.. అంటూ తండ్రి కుమార్తెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రతీషా ఆత్మహత్యకు పాల్పడింది. ఇలా చిన్నచిన్న కారణాలతో నేటితరం పిల్లలు ప్రాణాలు తీసుకుని కన్నవారికి శోకం మిగుల్చుతున్నారు.

First Published:  29 March 2023 12:20 PM GMT
Next Story