Telugu Global
CRIME

టికెట్‌ అడిగినందుకు టీటీఈ ని తోసి చంపేశాడు

కేరళలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు.

టికెట్‌ అడిగినందుకు టీటీఈ ని తోసి చంపేశాడు
X

కేరళలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఈ ఘటనలో టీటీఈ అవతలి పట్టాలపై పడగా, సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడిక్కడే మరణించాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. .

టీటీఈ వినోద్‌ తన విధుల్లో భాగంగా మంగళవారం రాత్రి ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో రైలులోని ఎస్‌ 11 బోగీలో ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్‌ అనే ప్రయాణికుడిని టెకెట్‌ చూపించమని అడిగారు. దీంతో ఇద్దరిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఆగ్రహానికి లోనైన ప్రయాణికుడు వినోద్ ని రైలులో నుంచి కిందకు తోసేశాడు.

దీంతో వినోద్ అవతలి పట్టాలపై పడిపోగా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొనడంతో మృతిచెందారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు ఒడిశాకు చెందిన రజనీకాంత్ ​పాలక్కాడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రజనీకాంత్ ​ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీటీఈ వినోద్‌ ఎర్నాకుళంకు చెందినవారని, ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారని సమాచారం. ఈ ఘటన సంబంధించి కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

First Published:  3 April 2024 5:44 AM GMT
Next Story