Telugu Global
CRIME

సోషల్ మీడియాలో పరిచయం.. కలిసేందుకు వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్

సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు యువకులను కలిసేందుకు వెళ్లిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది.

సోషల్ మీడియాలో పరిచయం.. కలిసేందుకు వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్
X

సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు యువకులను కలిసేందుకు వెళ్లిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో పోలీసులు 19, 21 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

ఢిల్లీలోని మదంగిర్ కు చెందిన 18 ఏళ్ల యువతికి ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. ఆ ఇద్దరితో యువతి చాటింగ్ చేస్తూ స్నేహాన్ని కొనసాగింది. జనవరి 29న ఢిల్లీలోని మదంగిర్ కు వచ్చిన ఆ ఇద్దరు యువకులు తమను కలిసేందుకు రావాలని యువతిని కోరారు. దీంతో ఆ యువతి ఇంటి నుంచి వారికోసం బయటకు వచ్చింది.

బైక్ పై వచ్చిన యువకులు తమ వెంట రావాలని యువతిని కోరారు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆ యువకులు తనను బెదిరించి బలవంతంగా బైక్ పై మాల్వియా నగర్ కు తీసుకువెళ్లారని, అక్కడ తనకు భోజనంలో మత్తు మందు పెట్టి స్పృహ కోల్పోయాక తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకొని అక్కడి నుంచి బయటపడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు మీరట్ లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక పోలీస్ బృందం అక్కడికి చేరుకొని గురువారం రాత్రి ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.

First Published:  2 Feb 2024 2:34 PM GMT
Next Story