Telugu Global
CRIME

వివాహేత‌ర సంబంధాన్ని ప్ర‌శ్నించాడ‌ని తండ్రిపై దాడి.. - ఆ దారుణాన్ని వీడియోకాల్ చేసి ప్రియురాలికి చూపిన పైశాచికం

న‌గ‌రంలోని ఓ కాల‌నీకి చెందిన 39 ఏళ్ల మ‌హిళ‌తో త‌న కుమారుడు భ‌ర‌త్ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని తెలుసుకున్న దిల్లీబాబు కుమారుడిని హెచ్చ‌రించాడు.

వివాహేత‌ర సంబంధాన్ని ప్ర‌శ్నించాడ‌ని తండ్రిపై దాడి.. - ఆ దారుణాన్ని వీడియోకాల్ చేసి ప్రియురాలికి చూపిన పైశాచికం
X

వివాహేత‌ర సంబంధం వ‌ద్ద‌ని వారించిన తండ్రిపైనే దాడికి దిగాడు.. ఈ ఘ‌ట‌న‌ను త‌న ప్రియురాలికి వీడియో కాల్ చేసి మ‌రీ చూపించాడు.. ఆ క‌సాయి కొడుకు అమానుషానికి తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రి పాల‌య్యాడు అత‌ని తండ్రి. చిత్తూరులో ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

చిత్తూరుకు చెందిన దిల్లీబాబు హోంగార్డు. అత‌ని కుమారుడు భ‌ర‌త్ (21) మూట‌లు మోసే కూలీ. న‌గ‌రంలోని ఓ కాల‌నీకి చెందిన 39 ఏళ్ల మ‌హిళ‌తో త‌న కుమారుడు భ‌ర‌త్ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని తెలుసుకున్న దిల్లీబాబు కుమారుడిని హెచ్చ‌రించాడు. ఇది స‌రికాద‌ని న‌చ్చ‌చెప్పాడు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని చెప్పి చూశాడు. అయినా తండ్రి మాట లెక్క‌చేయ‌ని కుమారుడు వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఇక లాభం లేద‌నుకున్న తండ్రి పోలీసులు మంద‌లిస్తే దారికొస్తాడ‌ని అనుకున్నాడు. పోలీసుల దృష్టికి ఈ విష‌యం తీసుకెళ్లాడు.

దీంతో స్పందించిన చిత్తూరు టూటౌన్ పోలీసులు భ‌ర‌త్‌ను పోలీస్‌స్టేష‌న్‌కు ర‌ప్పించి తీవ్రంగా మంద‌లించి పంపించారు. ఈ ఘ‌ట‌న‌తో తండ్రిపై క‌క్ష పెంచుకున్న భ‌ర‌త్‌.. ఏకంగా ఆయ‌న‌పైనే దాడికి దిగాడు. ఆదివారం సాయంత్రం తండ్రిపై దాడి చేస్తున్నానంటూ త‌న ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆమెకు చూపిస్తూ మ‌రీ ఈ అమానుషానికి ఒడిగ‌ట్టాడు. ఈ క్ర‌మంలో క‌ర్ర‌తో తండ్రి త‌ల‌పై బ‌లంగా కొట్ట‌డంతో ఆయ‌న తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. దీంతో స్థానికులు అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  27 Feb 2023 3:51 AM GMT
Next Story