Telugu Global
CRIME

రూ.500 కోట్ల క్రిప్టో స్కామ్.. ఢిల్లీలో బయటపడిన బాగోతం

వీరి మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టిన కొంత మంది.. దుబాయ్‌లో ఆఫీస్ చూడాలని వెళ్లగా.. వారికి నిర్మాణంలో ఉన్న ఏవో కొన్ని భవనాలను చూపించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

రూ.500 కోట్ల క్రిప్టో స్కామ్.. ఢిల్లీలో బయటపడిన బాగోతం
X

క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.500 కోట్ల మేర మదుపర్లను మోసం చేసిన ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. కొంత మంది బృందంగా ఏర్పడి.. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మబలికి వందల కోట్లు వసూలు చేవారు. ఆ తర్వాత నెమ్మదిగా దేశం నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. 200 శాతం లాభాలు వస్తాయని చెప్పడమే కాకుండా, భారీగా ఇన్వెస్ట్ చేసే వాళ్లకు దుబాయ్ వంటి ప్రాంతాలకు హాలీడే ట్రిప్స్‌కు కూడా పంపిస్తామని నమ్మబలికారు.

ఇటీవల ఇన్వెస్టర్ల కోసం గోవాలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారని, 5 స్టార్ హోటల్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు మదుపర్లను తీసుకొని వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి వివరించడమే కాకుండా.. క్రిప్టో ద్వారా ఎలా లాభాలు పొందవచ్చో మదుపర్లకు క్లాసులు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక తమ కంపెనీకి దుబాయ్‌లో ఒక అద్భుతమైన కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని కూడా ఇన్వెస్టర్లకు చెప్పారు.

వీరి మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టిన కొంత మంది.. దుబాయ్‌లో ఆఫీస్ చూడాలని వెళ్లగా.. వారికి నిర్మాణంలో ఉన్న ఏవో కొన్ని భవనాలను చూపించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మహారాష్ట్రలో ఒక కోఆపరేటీవ్ బ్యాంకును కూడా నిర్వహిస్తున్నట్లు కూడా ఇన్వెస్టర్లకు చెప్పారు. కానీ పోలీసుల దర్యాప్తులో అవన్నీ అసత్యలే అని తేలింది. క్రిప్టో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మి ఒక ఇన్వెస్టర్ రూ.1.47 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక ఏడాదిలోనే ఇది రెట్టింపు అవుతుందని చెప్పడంతో అతడు భారీగా ఇన్వెస్ట్ చేశారు. అవసరం అయితే ఏడాదిలోపే డ్రా చేసేకునే వెసులు బాటు ఉందని చెప్పడంతోనే తాను పెట్టుబడిపెట్టినట్లు పోలీసులకు వివరించాడు.

పెట్టుబడి పెట్టిన వారికి ప్రతీ నెల 5, 15, 25వ తేదీన రిటర్న్స్ అకౌంట్లలో జమ అవుతాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో జమచేయలేదని వాళ్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మోసగాళ్లు ఇండియా వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  29 Dec 2022 3:28 PM GMT
Next Story