Telugu Global
CRIME

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి – మరో ఆరుగురి పరిస్థితి విషమం

కర్నాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి – మరో ఆరుగురి పరిస్థితి విషమం
X

సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కర్నాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో మృతిచెందినవారిలో అబ్దుల్‌ రహమాన్‌ (62), సలీమా జీ (85), చిన్నారులు మరియా (5), బుస్రా (2), వాసిర్‌ రవుత్‌ (7 నెలలు) ఉన్నారు. గాయపడిన వారిలో సమీరా (5), హుస్సేన్‌ (10), షఫీ, ఖదీరున్నీసా, హబీబ్, అలీ, షాజహాన్‌ బేగ్‌ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిలో అలీకి వనపర్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12 మంది ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సోమవారం తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. డైవర్‌ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదానికి గురైన కారులో చిక్కుకుపోయిన చిన్నారుల మృతదేహాలను బయటికి తీసేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది గంటకు పైగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First Published:  4 March 2024 3:35 AM GMT
Next Story