Telugu Global
CRIME

స్కూటీని ఢీకొని అర్ధ కిలోమీటర్ లాక్కెళ్లిన లారీ.. చిన్నారి సహా ముగ్గురి దుర్మరణం

షాజహాపూర్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఓ చిన్నారితో కలిసి స్కూటీలో వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ నియంత్రణ కోల్పోయి స్కూటీని ఢీకొంది.

స్కూటీని ఢీకొని అర్ధ కిలోమీటర్ లాక్కెళ్లిన లారీ.. చిన్నారి సహా ముగ్గురి దుర్మరణం
X

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ఓ లారీ స్కూటీని ఢీకొని ఆగకుండా అర్ధ కిలోమీటర్‌ ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ప్రమాదాన్ని ద‌గ్గ‌ర నుంచి చూసిన స్థానికులు కేకలు పెడుతున్నా.. ఆ లారీ డ్రైవర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.

షాజహాపూర్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఓ చిన్నారితో కలిసి స్కూటీలో వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఓ లారీ నియంత్రణ కోల్పోయి స్కూటీని ఢీకొంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు లారీలో స్కూటీ ఇరుక్కుపోయిందని.. వాహనాన్ని ఆపాలంటూ కేకలు పెట్టారు.

ఆపితే కొడతారన్న భయంతో డ్రైవర్ ఇంకా వేగంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. లారీ ఈడ్చుకు వెళ్లడంతో స్కూటీపై ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలతో కిందకు పడిపోయారు. అర్ధ కిలోమీటర్ దూరం వెళ్ళిన లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయాడు. స్థానికులు గాయపడ్డ ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్ప‌టికే ఆ ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

లారీ స్కూటీని ఢీకొన్న ఘటన షాజహాపూర్ లో కలకలం రేపింది. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, కనీసం ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని ఆపకుండానే వెళ్ళిపోయాడని.. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి సహా ముగ్గురి మృతికి కారణమైన లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  19 March 2023 5:37 AM GMT
Next Story