Telugu Global
CRIME

అబ్దుల్లాపూర్‌మెట్ త‌ర‌హాలోనే మ‌రో హ‌త్య‌.. - ప్రేమ వ్య‌వ‌హారంలో స్నేహితుడిని హ‌త‌మార్చిన వైనం

విజ‌య‌న‌గ‌రం గుట్ట వ‌ద్ద‌కు తీసుకెళ్లి క‌ర్ర‌తో త‌ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసి హ‌త‌మార్చారు. అదే ప్రాంతంలో బండ‌రాళ్ల మ‌ధ్య మృత‌దేహాన్ని పారేసి వెళ్లిపోయారు

అబ్దుల్లాపూర్‌మెట్ త‌ర‌హాలోనే మ‌రో హ‌త్య‌.. - ప్రేమ వ్య‌వ‌హారంలో స్నేహితుడిని హ‌త‌మార్చిన వైనం
X

అబ్దుల్లాపూర్ మెట్‌లో జ‌రిగిన ఘ‌ట‌న త‌ర‌హాలోనే నిజామాబాద్ జిల్లాలో మ‌రో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమిస్తున్న యువ‌తినే త‌న స్నేహితుడూ ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకున్న యువ‌కుడు త‌ట్టుకోలేక‌పోయాడు.. త‌న పెళ్లికి అడ్డొస్తాడ‌ని భావించి.. స్నేహితుడిపై ప‌గ పెంచుకున్నాడు. అత‌న్ని అత్యంత దారుణంగా హ‌త‌మార్చాడు. హ‌త్య జ‌రిగి ఐదు నెల‌లు కాగా, తాజాగా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

ఆంధ్రాన‌గ‌ర్ పంచాయ‌తీ ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర కాల‌నీలో సంచార కుటుంబాలు నివ‌సిస్తున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన కార్తీక్ (22), బాప‌ట్ల రాజు (22) స్నేహితులు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ యువ‌తి రాజు ఇంటికి త‌ర‌చూ వ‌చ్చేది. ఆమెను వీరిద్ద‌రూ ప్రేమించారు. ఆ యువ‌తిని పెళ్లి చేసుకోవాల‌ని భావించిన రాజు.. త‌న‌కు కాబోయే భార్య‌ను ప్రేమిస్తున్నాడ‌ని స్నేహితుడిపై క‌క్ష పెంచుకున్నాడు.

త‌న త‌మ్ముడు బొజ్జ హ‌రీశ్‌తో క‌లిసి కార్తీక్‌ను హ‌త‌మార్చేందుకు ప్లాన్ చేశాడు. 2022 సెప్టెంబ‌రు 20న కార్తీక్‌తో నందిపేట్ శివారులోని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద మ‌ద్యం తాగించారు. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న విజ‌య‌న‌గ‌రం గుట్ట వ‌ద్ద‌కు తీసుకెళ్లి క‌ర్ర‌తో త‌ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసి హ‌త‌మార్చారు. అదే ప్రాంతంలో బండ‌రాళ్ల మ‌ధ్య మృత‌దేహాన్ని పారేసి వెళ్లిపోయారు. అనంత‌రం రాజు తాను ప్రేమించిన యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు.

కుమారుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆంధ్రా ప్రాంతానికి ప‌నుల కోసం వెళ్లి ఉంటాడ‌ని కార్తీక్ త‌ల్లి చిన్న వెంక‌ట‌ర‌మ‌ణ భావించింది. ఆమె భ‌ర్త ఇంత‌కుముందే చ‌నిపోయాడు. అయినా త‌న పెద్ద‌కుమారుడి స‌హాయంతో తెలిసిన అన్ని ప్రాంతాల్లోనూ ఆరా తీశారు. అయినా ఫ‌లితం లేక‌పోయింది. ఇటీవ‌ల అబ్దుల్లాపూర్ మెట్‌లో జ‌రిగిన దారుణం వెలుగు చూడ‌టంతో అదే త‌ర‌హాలో త‌మ ప్రాంతంలోనూ జ‌రిగింద‌ని, కార్తీక్‌ని చంపేసి విజ‌య‌న‌గ‌రం గుట్ట ప్రాంతంలో ప‌డేశార‌ని ప‌లువురు యువ‌కులు ఆమె త‌ల్లికి చెప్పారు. దీంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా, వారు ఆ ప్రాంతంలో ప‌రిశీలించ‌గా, ఒక అస్థిపంజ‌రం క‌నిపించింది. పోస్టుమార్టంలో అది కార్తీక్ మృత‌దేహంగా నిర్ధార‌ణ అయింది. ఈ స‌మాచారం తెలుసుకున్న నిందితులు ప‌రారయ్యారు. దీంతో వారిని త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  2 March 2023 3:41 AM GMT
Next Story