Telugu Global
CRIME

కర్నాటకలో దారుణం.. విద్యార్థిని పారతో కొట్టి చంపిన టీచర్

విద్యార్థిని ఎందుకు ఇంత దారుణంగా కొట్టాడో ఇంకా తెలియరాలేదని గడక్ జిల్లా సీనియర్ పోలీస్ ఆఫీసర్ శివప్రకాశ్ దేవరాజు తెలిపారు.

కర్నాటకలో దారుణం.. విద్యార్థిని పారతో కొట్టి చంపిన టీచర్
X

కర్నాటకలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు మంచిగా చదువు చెప్పి, ప్రయోజకులుగా చేయాల్సిన టీచరే దారుణానికి ఒడిగట్టాడు. ఒక విద్యార్థిని పారతో ఇష్టం వచ్చినట్లు బాదడంతో.. ఆ బాధకు తట్టుకోలేక తొమ్మదేళ్ల బాలుడు మృతి చెందాడు. గడగ్ జిల్లా హడలి గ్రామంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో బాధిత విద్యార్థి భరత్ బరకేరి 4వ తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ముట్టు హడలి అనే టీచర్.. శనివారం విద్యార్థిని పారతో చితకబాది, మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేశాడు.

విద్యార్థిని కొడుతున్న విషయం తెలుసుకొని అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న భరత్ తల్లి గీత బరికేరి వచ్చి అడ్డుకోబోయింది. తన కొడుకును ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించగా.. ఆమెపై కూడా చేయిచేసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, తీవ్రంగా గాయపడిన భరత్‌ను హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. విద్యార్థిని కొట్టిన వెంటనే నిందితుడు ముట్టు అక్కడి నుంచి పారిపోయాడు.

విద్యార్థిని ఎందుకు ఇంత దారుణంగా కొట్టాడో ఇంకా తెలియరాలేదని గడక్ జిల్లా సీనియర్ పోలీస్ ఆఫీసర్ శివప్రకాశ్ దేవరాజు తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న కలహాలే ప్రధాన కారణం అని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని శివప్రకాశ్ వెల్లడించారు.

కాగా, గత వారం ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై కత్తెరతో దాడి చేయడమే కాకుండా మొదటి అంతస్తు నుంచి కిందకు నెట్టివేసింది. ప్రభుత్వ పాఠశాలలోనే ఈ సంఘటన కూడా జరగడం గమనార్హం.

First Published:  19 Dec 2022 2:57 PM GMT
Next Story