Telugu Global
CRIME

నచ్చినవాడిని పెళ్లాడతానన్నందుకు కూతురిని చంపిన తల్లి

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తెకు పెళ్లి చేసే విషయంలో గొడవపడి తల్లి, ఇతర కుటుంబ సభ్యులే ఆమెను చంపిన ఘటన స్థానికంగా కలకలంరేపింది.

నచ్చినవాడిని పెళ్లాడతానన్నందుకు కూతురిని చంపిన తల్లి
X

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తెకు పెళ్లి చేసే విషయంలో గొడవపడి తల్లి, ఇతర కుటుంబ సభ్యులే ఆమెను చంపిన ఘటన స్థానికంగా కలకలంరేపింది. నిండా 18సంవత్సరాలు లేవు ఆమెకి. ప్రేమకి ఆకర్షణకి మధ్య తేడా కూడా తెలియక పోవచ్చు. కానీ అన్ని తెలుసు అనుకొనే వయసు అది.

ఇంట్లో వాళ్ళు బాలికకు పెళ్లి చేద్దామనుకున్నారు. సంబంధం కూడా చూశారు. కానీ అందుకు ఆమె ససేమిరా అంది..అంతే కాదు తనకి నచ్చినవాడినే చేసుకుంటానని మొండి పట్టు పట్టింది. తప్పు చేస్తున్నావు అంటే అర్థం చేసుకోలేని వయసు ఆమెది.. అలాంటప్పుడు నెమ్మదిగా నచ్చ చెప్పాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది. కానీ ఎవరూ అలా ప్రవర్తించలేదు. చివరికి 17 ఏళ్ల బాలిక తల్లి, సోదరుల చేతిలో చావు దెబ్బలు తిని శవంగా మారింది.

గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన ఎర్రితాత, అంజినమ్మల కుమార్తె కోమలి. ఆమెకు ఓ సంబంధం చూసిన తల్లిదండ్రులు పెళ్ళికి అంగీకరించవలసిందిగా కోరారు. అయితే పెద్దలు చూసిన సంబంధం తనకు ఇష్టం లేదని.. తాను ప్రేమించిన యువకుడినే చేసుకుంటానని గట్టిగా చెప్పింది కోమలి.

ఈ విషయమై కొద్దిరోజులుగా ఇంట్లో తరచూ గొడవ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బాలిక ప్రేమను అంగీకరించడం ఇష్టం లేక.. అలా అని కూతురికి నచ్చచెప్ప లేక ఆమెను కొట్టి ,ఆవేశంలో చున్నీతో ఊరి వేసి హత్య చేశారు తల్లి అంజినమ్మ, ఇతర కుటుంబ సభ్యులు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. తామే బాలికను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. తల్లి, కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


First Published:  8 Nov 2023 11:04 AM GMT
Next Story