Telugu Global
Cinema & Entertainment

'బ్రహ్మాస్త్ర'తోనైనా థియేటర్లకి కాసులు కురుస్తాయా?

నాలుగు ఏళ్లుగా నిర్మాణంలో ఉండి సెప్టెంబర్ 9న విడుదలకి సిద్ధమవుతోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బ్రహ్మాండమైన విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ ప్రోమో కార్యక్రమాలు చేపట్టి వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు.

బ్రహ్మాస్త్రతోనైనా థియేటర్లకి కాసులు కురుస్తాయా?
X

ఇప్పుడు బాలీవుడ్‌లో అందరి కళ్ళూ 'బ్రహ్మాస్త్ర : పార్ట్ వన్- శివ' మీదే ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడంతో వరస ఫ్లాపులు ఎదుర్కొన్న బాలీవుడ్ ఇప్పుడైనా ప్రేక్షకుల దర్శన భాగ్యం కలగకపోతుందా అన్న ఆశతో ఉంది. పైగా సౌత్ సినిమాల తాకిడికి విలవిల లాడుతున్న బాలీవుడ్‌కి తగిన సమాధానం చెప్పగల అస్త్రంగా 'బ్రహ్మాస్త్ర' కన్పిస్తోంది. నాలుగు ఏళ్లుగా నిర్మాణంలో ఉండి సెప్టెంబర్ 9న విడుదలకి సిద్ధమవుతోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో బ్రహ్మాండమైన విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. హీరో రణబీర్ కపూర్ ప్రోమో కార్యక్రమాలు చేపట్టి వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్నాడు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అత్యంత ఖరీదైన మెగా మూవీ ఇది. స్పిరిచ్యువల్ ఫాంటసీ - అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉన్న ఈ క్లాస్- మాస్ కమర్షియల్ ప్రేక్షకుల్ని తప్పకుండా థియేటర్ల బాట పట్టిస్తుందని నమ్ముతున్నారు.

హిందీ నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లని నిర్లక్ష్యం చేసి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంతో, సింగిల్ స్క్రీన్ మార్కెట్‌ని కూడా సౌత్ సినిమాలు వశపర్చుకున్నాయి. ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' సింగిల్ స్క్రీన్ సినిమా లక్షణాలతో కూడా ఉంది గనుక ఈ సెగ్మెంట్‌లో కూడా వ్యాపారం చేసుకుంటుందని లెక్కలు కడుతున్నారు. షో మాన్ రాజ్ కపూర్ మనవడు రణబీర్ కపూర్ నటించిన గత 8 సినిమాల్లో రెండే హిట్టయ్యాయి. ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర' లో హీరోయిన్ అలియా భట్‌తో జత కట్టి వస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, అతిథి పాత్రలో షారూఖ్ ఖాన్ మొదలైన స్టార్లు ఇందులో న‌టిస్తున్నారు.

'బ్రహ్మాస్త్ర' కథని లీకు వీరుల కోసమేం దాచిపెట్టలేదు. నిర్మాతలే కథని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇక స్టార్ల పేరు చెప్పుకుని ప్రమోషన్లు నిర్వహిస్తే ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. స్టార్ సినిమా కదాని పోతే గత వారం 'లైగర్' కూడా జాడించి తన్నింది ప్రేక్షకుల్ని. అందుకని విషయం (కథ) చెప్పేస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. విషయం చెప్పాలంటే విషయంలో విషయం ఉండాలి. విషయం లేకపోతే విషయం చెప్పే ధైర్యం చేయలేరు. అందుకని ప్రేక్షకులకిదో భరోసానిస్తుంది. ఈ పద్ధతే బెటర్.

'బ్రహ్మాస్త్ర' కథలో రణబీర్ కపూర్‌కి పంచభూతాల్లో ఒకటైన అగ్నితో వింత సంబంధముంటుంది. దాంతో బ్రహ్మాస్త్రాన్ని మేల్కొల్ప గల శక్తిని కలిగి ఉంటాడు. ఈ అతీత శక్తి, విశ్వాన్ని నాశనం చేయగలదని, సృష్టిని నాశనం చేయగలదని, జీవులని అంతమొందించ గలదని తెలుసుకుంటాడు. మరోవైపు, దుష్ట శక్తుల రాణి జునూన్ కూడా ఈ బ్రహ్మాస్త్రాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంటుంది. బ్రహ్మాస్త్రం కోసం వీళ్ళిద్దరి పోరాటమే ఈ మూవీ. ఇది పురాణ, దైవిక ఘటనల ఆథ్యాత్మిక థ్రిల్లర్‌గా ఉంటుంది. ప్రస్తుతం నార్త్ లో ఉన్న‌ మతాభిమానపు భక్తి వాతావరణంలో 'కార్తికేయ 2' లాగే ఇది కూడా హిట్టవుతుందని నమ్ముతున్నారు.

దర్శకుడు అయాన్ ముఖర్జీ పదేళ్ళ కల ఈ ప్రతిష్టాత్మక మూవీ. దీని తెర వెనుక కథనాన్ని వివరించే వీడియోని అలియా భట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అయాన్ ముఖర్జీ సిమ్లాలో రైటింగ్ వర్క్ చేపట్టిన 2011 నుంచీ దాంతో సాగిన పదేళ్ళ ప్రయాణం గురించి చెప్పుకొస్తాడు. అతడి మొదటి సినిమా 'వేక్ అప్ సిద్' (2009) అప్పుడప్పుడే విడుదలై, రెండవ మూవీ 'యే జవానీ హై దీవానీ' (2013) కోసం పని చేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. ఎల్లప్పుడూ సిమ్లా పర్వతాల్లో చాలా శక్తిని, బలమైన ఆధ్యాత్మికతను పొందుతానని చెప్పాడు. హిమాలయాల శక్తి నుంచే తనకి బ్రహ్మాస్త్ర కథకి ఐడియా పుట్టిందని నమ్ముతున్నట్టు వీడియోలో చెప్పాడు.

'బ్రహ్మాస్త్ర' మూడు భాగాల కథగా ప్లాన్ చేశారు. అంటే మూడు సినిమాలు. ప్రస్తుతం మొదటి భాగం విడుదలవుతోంది. మొదటి భాగం ప్రధానంగా శివగా రణబీర్ కథతో ఉంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం 'బ్రహ్మాస్త్ర'తో ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం, భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుంచి ఇంతవరకూ రాని కంప్యూటర్ మాయా జగత్తుని సృష్టించడం అయాన్ చేపట్టిన బాధ్యత. అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో పురాతన భారతీయ మూలాలు - సంస్కృతి, ఆధ్యాత్మికతలను లోతుగా చూపించే విజువల్ వండర్‌గా హామీ ఇస్తున్నాడు.

తన జీవితంలో 10 సంవత్సరాలు ఈ మూవీ కోసం వెచ్చించానని, ప్రారంభంలో 'బ్రహ్మాస్త్ర' అనేది ఒక హాస్యాస్పదమైన ఆలోచనగా ఉండేదని, క్రమంగా దీని మీద ఆత్మ విశ్వాసం బలపడిందని, చెప్పుకొచ్చాడు. చేయాలనుకున్నది ఎలా చేయాలో రోడ్ మ్యాప్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ వ్యయాన్ని నియంత్రించే ప్రణాళికల్లేవు, ఈ సవాళ్ళని ఎలాగైనా అధిగమించగలిగితే, సినిమా అనుకున్నట్టు సరిగ్గా వస్తే, నిజంగా ఇది మార్గదర్శక సంచలనాత్మక చలన చిత్రమవుతుందని, దేశం గర్వించదగ్గ కానుక అవుతుందని చెప్పుకొచ్చాడు.

దీన్ని కరణ్ జోహార్, అపూర్వా మెహతా, నమిత్ మల్హోత్రా, అయాన్ ముఖర్జీ కలిసి నిర్మించారు. ఇదీ విషయం. ఇప్పుడు దీనికి ప్రేక్షకులు ఏమాత్రం తరలివస్తారన్నది ప్రశ్న. ఈ ప్రశ్న ఉండగా బాలీవుడ్ సినిమాల కడుపు కొట్టే ట్రెండ్ ఒకటి ఇటీవల నడుస్తోంది. ప్రతీ పెద్ద హిందీ సినిమానీ ఏదో వంకపెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నారు. దీని కారణంగా కూడా ప్రేక్షకులు రావడానికి వెనుకాడవచ్చు. ఈ బాయ్ కాట్ పోకిరీల ఆటకట్టించే చర్యలు తీసుకుంటేగానీ సినిమాల పరిస్థితి మెరుగుపడదు. హీరోయిన్ ఆలియా భట్ ఏదో అన్నదని 'బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర' అని కొత్త రాగ మెత్తుకున్నారు మానసిక రోగులు.

First Published:  28 Aug 2022 9:04 AM GMT
Next Story