Telugu Global
Cinema & Entertainment

సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్

టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు షూటింగ్స్ బంద్ చేసిన సంగతి తెలిసిందే. అలా ఆపేసిన సినిమాల్ని సెప్టెంబర్ 1 నుంచి తిరిగి మొదలుపెట్టబోతున్నట్టు నిర్మాతల మండలి ప్రకటించింది

tolly wood workers
X

టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు ప్రకటించిన నిరవధిక సమ్మె ముగిసింది. నిన్న సుదీర్ఘంగా చర్చించిన నిర్మాతల మండలి సభ్యులు, సెప్టెంబర్ 1 నుంచి తిరిగి షూటింగ్స్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. నిజానికి ఇవాళ్టి నుంచే షూటింగ్స్ మొదలుకావాలి. కానీ అత్యవసరకంగా షూటింగ్స్ పెట్టుకోవాలనుకుంటే రేపట్నుంచే మొదలుపెట్టుకోవచ్చని, లేదంటే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చని నిర్మాతలు తేల్చిచెప్పారు.

ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం, నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు పెరగడం, ఓటీటీకి చిత్రాలను స్ట్రీమింగ్ కు ఇచ్చే అంశాలపై చర్చించేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో పాటు, మరికొంతమంది సభ్యులు తమ సినిమాల షూటింగ్స్ ఆపేశారు. మిగతా షూటింగ్స్ మాత్రం యథాతథంగా జరిగాయి. ఇప్పుడు గిల్డ్ సభ్యులు కూడా సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్స్ కు వెళ్తామని ప్రకటించారు.

మరి ఇన్ని రోజులు వీళ్లు సాగించిన చర్చల ఫలితమేంటి? ఆ వివరాల్ని మాత్రం నిర్మాతల మండలి వెల్లడించలేదు. 30వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటుచేస్తామని, ఆరోజు తమ తుది ఫలితాల్ని వెల్లడిస్తామని తెలిపారు. సినిమాను ఓటీటీకి ఇచ్చే అంశంపై మాత్రం స్పష్టమైన విధానాన్ని రూపొందించారు. పెద్ద సినిమాల్ని 7 వారాల లోపు ఓటీటీకి ఇవ్వకూడదని గట్టిగా తీర్మానించుకున్నారు.

వీటితో పాటు టికెట్ ధరలు, థియేటర్లలో స్నాక్స్ ధరలు, వీపీఎఫ్ చార్జీలపై కూడా నిర్మాతలు తీర్మానాలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న ధరల్నే యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక థియేటర్లలో స్నాక్స్ రేట్లు తగ్గించాల్సిందిగా ఇప్పటికే మల్టీప్లెక్స్ యజమానులకు సూచించామన్నారు. ఇక వచ్చేనెల నుంచి వర్చువల్ ప్రింట్ ఫీజును వసూలు చేయమని నిర్మాతలు తేల్చిచెప్పారు.

First Published:  24 Aug 2022 3:21 AM GMT
Next Story