Telugu Global
Cinema & Entertainment

మహా శివరాత్రి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం!

సద్గురు జగ్గీవాసు దేవ్ కి చెందిన ఇషా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ఓవర్‌నైట్ మెగా ఈవెంట్ గా మార్చి 8న సాయంత్రం 6 గంటల నుంచి మల్టీప్లెక్సుల్లో ప్రసారం చేస్తుంది.

మహా శివరాత్రి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం!
X

ప్రీమియర్ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ సినిమాస్ మొదటిసారిగా మహా శివరాత్రి వేడుకల్ని బిగ్ స్క్రీన్స్ పై ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తోంది. సద్గురు జగ్గీవాసు దేవ్ కి చెందిన ఇషా ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని ఓవర్‌నైట్ మెగా ఈవెంట్ గా మార్చి 8న సాయంత్రం 6 గంటల నుంచి మల్టీప్లెక్సుల్లో ప్రసారం చేస్తుంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం వుంటుంది. దేశంలోని 35 నగరాల్లోని 50 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో ప్రత్యక్ష ప్రదర్శన జరుగుతుంది. వీక్షకులు ఈ పవిత్ర ఘట్టాన్ని సాటి భక్తులతో కలిసి చూసే భాగ్యాన్ని కలిగి వుండడమే కాకుండా, ఆధ్యాత్మిక గురువు సద్గురువు ద్వారా ప్రత్యేకంగా శక్తినిచ్చే రుద్రాక్షని కూడా అందుకుంటారు.

ఈ వేడుకలు చూడదగ్గ దృశ్యం. ఇందులో ధ్యాన సెషన్‌లు, సద్గురు ద్వారా జ్ఞానోదయం కలిగించే ఉపన్యాసాలు, శంకర్ మహదేవన్, గురుదాస్ మాన్, బ్రోధ వి, పారడాక్స్ వంటి ప్రఖ్యాత కళాకారుల మంత్రముగ్ధుల్ని చేసే సంగీత, నృత్య ప్రదర్శనలు వుంటాయి. ఇతర శాస్త్రీయ గాయకులతో, నృత్యకారులతో పాటు, ఇషా స్వదేశీ బ్యాండ్, “సౌండ్స్ ఆఫ్ ఇషా” దేశం అంతటా వున్న అనేక ఇతర కళాకారులతో కలిసి ప్రదర్శన ఇస్తుంది.

దేశంలోని పవిత్ర పండుగలలో మహాశివరాత్రి అతిపెద్దది. అత్యంత ముఖ్యమైనది కూడా. ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటంటే, మానవ శరీరంలో శక్తి ప్రసరణ పై దిశగా వుంటుందని, కాబట్టి ఈ రాత్రి మేల్కొని వెన్నెముక నిటారుగా వుంచి జాగరణ చేయాలనీ, తద్వారా మనం ఏ సాధన చేస్తున్నా, ప్రకృతి నుంచి గొప్ప సహాయం వుంటుందనీ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వివరించారు.

దైవిక పండుగ మహాశివరాత్రి భారతీయ సంప్రదాయాలలో అసమానమైన ప్రాముఖ్యాన్ని కలిగి వుందనీ, ఆధ్యాత్మిక దైవత్వాన్ని కోరుకునేవారికి అపరిమితమైన అవకాశాల్ని అందిస్తుందనీ, భక్తుల కోసం పీవీఆర్- ఐనాక్స్ సినిమాస్ లో మొదటిసారిగా ఈ ఈవెంట్‌ ని వెండితెరపైకి తీసుకురావడానికి ఇషా సహకరించడం చాలా సంతోషకరమైనదనీ, భక్తులందరూ వారి సమీపంలోని పీవీఆర్- ఐనాక్స్ సినిమాస్ లో ఆధ్యాత్మిక మాయాజాలంలో మునిగితేలాలనీ పీవీఆర్- ఐనాక్స్ లిమిటెడ్ సహ- సీఈఓ గౌతమ్ దత్తా కోరారు. ఈ దివ్యానుభవంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి వున్న ప్రేక్షకులు తమ టికెట్స్ ని పీవీఆర్ లేదా ఐనాక్స్ యాప్‌ల ద్వారా, లేదా వెబ్‌సైట్‌ల ద్వారా పొందవచ్చు. టికెట్టు ధర 280 రూపాయలు.

First Published:  6 March 2024 6:47 AM GMT
Next Story