Telugu Global
Cinema & Entertainment

ఇక బాలయ్య చూపు పానిండియా వైపు!

బాలకృష్ణ పానిండియా ఆలోచన చేశారు. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' కి శ్రీకారం చుట్టాలని ఆలోచన చేస్తున్నారు.

X

ఇప్పుడు సౌత్ లో ఎవరి నోట విన్నా పానిండియా సినిమా...హిందీ వాళ్ళు హిందీ సినిమాలు తీసి దేశమంతటా విడుదల విడుదల చేస్తూంటే అవి పానిండియా సినిమాలు కాలేదు. దక్షిణ దేశంలో 'బాహుబలి' నుంచే ఈ మాట వినపడుతోంది. 'బాహుబలి' రెండు భాగాలు, ప్రభాస్ 'రాధేశ్యామ్' తో బాటు రానున్న ఇంకో మూడు సినిమాలు, అల్లు అర్జున్ 'పుష్ప', రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్', ఆఖరికి నిఖిల్ 'కార్తికేయ 2', ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ 'లైగర్'... ఇలా తెలుగు గు స్టార్లు పానిండియా స్టార్లు అయిపోతున్నారు. తెలుగు స్టార్లు పానిండియా మీదే దృష్టి పెట్టి కూర్చున్నారు- బాలీవుడ్ కి గట్టి పోటీనిస్తూ!

ఈ రేసులో నందమూరి బాలకృష్ణ కూడా దూకేశారు. నిజానికి 'అఖండ' తో దూకాల్సింది, దూకలేదు. బాలకృష్ణ చాలా ఆలస్యం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ ఎప్పుడో 80 ఏళ్ల క్రితమే పానిండియా మూవీ ఇచ్చేశారని మర్చిపోయినట్టున్నారు. ఇది గుర్తు పెట్టుకుని తానెప్పుడో పానిండియా స్టార్ అవ్వాల్సింది. కానీ ఇటీవల 'కార్తికేయ 2' సక్సెస్ తోనే స్ఫూర్తి పొంది ఈ ఆలోచన చేస్తున్నారు. మత భక్తితో కూడిన 'కార్తికేయ 2' మతం క్రియాశీలంగా వున్న హిందీ రాష్ట్రాల్లో సాధించిన విజయాన్ని చూశాక!

1953 లో భానుమ‌తి డైరెక్ష‌న్‌ లో ఎన్టీఆర్ తో 'చంఢీ రాణి' అనే పాపులర్ సినిమాని ఐదు భాష‌ల్లో రూపొందించారు. అంటే ఐదు భాష‌ల్లో షూటింగ్ చేశారు. ఐదు భాష‌ల్లోనూ స్ట్రెయిట్ మూవీ. ఇలా ఇదే అసలు సిసలు పాన్ ఇండియా మూవీ. కానీ ఇప్పుడు పానిండియా సినిమాలనుకుంటున్నవి అన్ని భాష‌ల్లో షూటింగ్ చేయడం లేదు. అలాగే 'పాతాళ భైర‌వి' ని అప్ప‌ట్లోనే హిందీలో స్ట్రెయిట్ మూవీగా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎన్టీఆరే హీరో. అలాగే ఏఎన్నార్ 'సువ‌ర్ణ సుంద‌రి' ని కూడా హిందీలో స్ట్ర‌యిట్ మూవీగానే విడుద‌ల చేశారు. ఇప్పుడు పానిండియా పేరుతో తీస్తున్న సినిమాలని కేవలం తెలుగు- హిందీల్లో షూట్ చేసి మిగిలిన భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు విడుదల చేస్తున్నారు. నాటికీ నేటికీ ఒరిజినాలిటీలో ఇదీ తేడా.

మొత్తానికి బాలయ్య పానిండియా ఆలోచన చేశారు. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' కి శ్రీకారం చుట్టాలని ఆలోచన చేస్తున్నారు. అయితే ఇది 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని. ఈ లోపు ఇంకో పానిండియా వదలదానికి సిద్ధమయ్యారు. అంటే ఈ రెండేళ్లలో ఏకంగా రెండు పానిండియా లన్నమాట.

మొదటిది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో. ఇందులో ద్విపాత్రాభినయం. ఒక పాత్ర అరవై ఏళ్ల వృద్ధ పాత్ర. రెండోది పోలీసు అధికారి. 'అఖండ' తో బాలయ్య వేవ్ ఎలా క్రియేట్ అయ్యిందో ఈ రెండిటితో అంతకి మించి ఆలిండియా లెవెల్లో బ్యాంగ్ ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 'అఖండ' హిందీ డబ్బింగ్ హిందీ రాష్ట్రాల్లో సూపర్ హిట్టవడం బాలయ్య పానిండియా పయనానికి పచ్చ జెండా వూపింది. 'అఖండ' హిందీ డబ్బింగ్ హక్కులు 20 కోట్లకి అమ్ముడుబోయాయంటే హిందీ రాష్ట్రాల్లో బాలయ్యకి మార్కెట్ వున్నట్టే.

చాలా కాలంగా బాలీవుడ్ నుంచి హిందీ మాస్ ప్రేక్షకుల ఆకలి తీర్చే సినిమాలు రావడం లేదు. తెలుగులో మాస్ మసాలాలే తీస్తారు. ఇందుకే తెలుగు సినిమాలు హిందీ రాష్ట్రాల్లో హిట్ అవుతున్నాయి. బాలయ్య మాస్ సినిమాలు ఈ వర్గం హిందీ ప్రేక్షకులకి సూటవుతాయి. ఇంకోటేమిటంటే బాలయ్యతో పానిండియా తీయడానికి పూరీ జగన్నాథ్ కూడా ఆలోచిస్తున్నట్టు ఒక వార్త. యువ స్టార్స్ కి దీటుగా ఇలా బాలయ్య బిగ్ ప్లాన్స్ తో బిజీ అవడం చూసి ఆశ్చర్య పోయేవాళ్లు ఆశ్చర్య పోతున్నారు. పానిండియా మార్కెట్ లో కనీసం 200 కోట్లు వసూళ్లు సాధించాలని అందుకు తగ్గ పథకాలు రచిస్తున్నారు. గోపీచంద్ మలినేని మూవీకి 'జై బాలయ్య' అని టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే 'బింబిసార' ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ తానూ బాలయ్యతో పానిండియా తీస్తానని ప్రకటించేశారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా పానిండియాతో బాలయ్య పవరెంతో తీసే మొదటి సినిమాతో తేలిపోతుంది. ఆ తర్వాతే ఎన్ని పానిండియాలైనా!

First Published:  25 Aug 2022 9:30 AM GMT
Next Story