Telugu Global
Cinema & Entertainment

దసరాకు రెండు మూడు సినిమాల విడుదల మామూలే.. చిరు సినిమాతో పోటీపై నాగార్జున కామెంట్స్

దసరా పండుగకు ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదల అవ్వడం 40 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. పండుగ సమయం కాబట్టి ఎన్ని సినిమాల మధ్య విడుదలైనా బాగున్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నాగార్జున తెలిపారు.

దసరాకు రెండు మూడు సినిమాల విడుదల మామూలే.. చిరు సినిమాతో పోటీపై నాగార్జున కామెంట్స్
X

కొన్నేళ్ల కిందటి వరకు టాలీవుడ్‌లో అగ్ర హీరోలు నటించిన సినిమాలు పోటాపోటీగా ఒకే రోజు విడుదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఆ ధోరణి మారింది. పెద్ద హీరోలు నటించిన సినిమాలు క్లాష్ కాకుండా నిర్మాతలు చర్చించుకుని.. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. పోటీ వల్ల కలెక్షన్లు చీలిపోకుండా చూసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఈ దసరాకు అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున నటించిన గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు విడుదల కానున్నాయి. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ రీమేక్ కాగా.. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ది ఘోస్ట్ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ రెండు సినిమాలు ఒకే రోజు పోటీపడటంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున స్పందించాడు.

చిరంజీవిని ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ఈ సారి తామిద్దరం హీరోలుగా నటించిన సినిమాలు పండుగకు పోటీపడుతున్నాయన్నారు. తాను మా ఇద్దరి సినిమాల విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. దసరా పండుగకు ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదల అవ్వడం 40 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. పండుగ సమయం కాబట్టి ఎన్ని సినిమాల మధ్య విడుదలైనా బాగున్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నాగార్జున తెలిపారు.

First Published:  19 Sep 2022 11:55 AM GMT
Next Story