Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ స్టార్ట్ కాకుండానే మహేష్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..రాజమౌళి కోసమేనా..!

మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

షూటింగ్ స్టార్ట్ కాకుండానే మహేష్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..రాజమౌళి కోసమేనా..!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఖలేజా సినిమా చేసినప్పటికీ ఆ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల వైకుంఠ పురములో సినిమా పూర్తయినప్పటి నుంచి త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలోనే ఉన్నారు. మహేష్‌కు కొద్దిరోజుల కిందట సర్జరీ జరగడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంలో జాప్యం జరిగింది.

ప్రస్తుతం తెలుగులో నిర్మాతల సంఘం సినిమా షూటింగ్‌లు ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన ఎత్తి వేయగానే మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ బాబు సరికొత్త కొత్త లుక్‌లో కనిపించనున్నారు. కెరీర్లో తొలిసారిగా గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే బాడీ పరంగా కూడా మేకోవర్ అవుతున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే చిత్ర బృందం అభిమానులకు సప్రైజ్ ఇచ్చింది.

ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌గా వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మామూలుగా మహేష్ బాబు నటించే సినిమాలకు సంబంధించి విడుదల తేదీని ముందే ప్రకటించే ఆనవాయితీ లేదు. ఆయన కెరీర్లోనే తొలిసారిగా సినిమా చిత్రీకరణ ప్రారంభం కాకుండానే విడుదల తేదీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ పూర్తయినప్పట్నుంచి మహేష్‌తో సినిమా చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్‌తో చేసే సినిమా తొందరగా ముగించి రాజమౌళితో సినిమా ప్రారంభించేందుకే మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  19 Aug 2022 5:00 AM GMT
Next Story