Telugu Global
Cinema & Entertainment

Superstar Krishna: ప్రయోగాల బాటసారి హీరో కృష్ణ (1943-2022)

Superstar Krishna: వీరుడి మరణ దృశ్యమిది...

హీరో కృష్ణ
X

హీరో కృష్ణ

మద్యం మత్తులో జోగుతున్న ఆ సైనికుడు తుపాకీ ఎత్తి- 'ఏంటాలోచిస్తున్నావ్? ఈ దెబ్బకి అమరుడై పోవాలనే?' అన్నాడు వ్యంగ్యంగా. ఆలోచన తన అమరత్వం గురించి కాదన్నాడు తుపాకీ ఎదురుగా గుండె దిటవుతో వున్నతను. తన ఈ విప్లవ జ్వాల భావితరాలకి స్పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. వెటకారంగా నవ్వాడు సైనికుడు. 'ఏంటా నవ్వు? కాల్చారా నన్ను పిరికి పందా! నువ్వు కాల్చి చంపేది నీ ఎదుట నిస్సహాయంగా వున్న మనిషినే – బెదరకు, కానీయ్!' అరిచాడు గట్టిగా, తాళ్ళతో బంధించి బందీగా వున్నతను. చావంటే భయం లేని అతణ్ణి చూసి పిచ్చెత్తి పోయిన సైనికుడు తుపాకీ దడదడ లాడించేశాడు క్షణమాలస్యం చెయ్యకుండా. నిట్ట నిలువునా శరీరాన్ని జల్లెడ చేసేశాయి తొమ్మిKrishna,ది తూటాలూ. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. జగత్ప్రసిద్ద విప్లవకారుడతను – ఎర్నెస్టో చేగువేరా!

చాలా అరుదుగా విప్లవకారులకి చట్టరీత్యా శిక్షలు పడతాయి. సూపర్ స్టార్ కృష్ణ 1974 లో అల్లూరి సీతారామరాజు చరిత్రని వెండి తెర కెక్కించి నప్పుడు అప్పటి ప్రేక్షకులకి ఎన్ కౌంటర్ అనే పదం తెలిసివుండదు. అలాటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూసి వుండరు. తెలుగు సినిమాకి మొదటి కలర్ కౌబాయ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 ఎంఎం, మొదటి ఆప్టికల్ స్టీరియో సౌండ్...ఇలా ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తనే మొదటిసారిగా తెలుగులో అందిస్తూ కొత్త చరిత్రలు రాసుకుంటూ పోయిన డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరోగా కృష్ణని ఇప్పటి వరకూ కీర్తించడం జరుగుతోంది.

అభ్యుదయకరంగా ఈ వినూత్న సాంకేతిక దృష్టే కాకుండా, 'అల్లూరి సీతారామ రాజు' తో కృష్ణ చరిత్రలోంచి అసంకల్పితంగా ఇంకేం శంఖం పూరించారో గ్రహించి గ్రంథస్థం చేయలేదెవరూ. సూపర్ స్టార్ కృష్ణ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాల్లో- తర్వాతి కాలంలో పోలీసులు చేపడుతూ పోయిన, ఇంకా ఇప్పటికీ చేపడుతూ వస్తున్న 'ఎన్ కౌంటర్' అనే చర్యని ఆనాడే అల్లూరి చరిత్ర ద్వారా ఎత్తి చూపారని మనం చెప్పుకు తీరాలి.

సినిమాలో ఈ ఎన్ కౌంటర్ లేదా రాజ్య హింస అనే దుశ్చర్య స్వాతంత్ర్య పూర్వం తెలుగు ప్రాంతంలో జరిగిందే. కాకపోతే అప్పట్లో బ్రిటిష్ ఏలుబడిలో వుంది. ఆనాడు బ్రిటిషర్లు అల్లూరి సీతారామారాజుతో పాల్పడింది ఎన్ కౌంటరే – కాకపోతే పక్కా బూటకపు ఎన్ కౌంటర్, పచ్చి హత్య. ఆ బ్రిటిష్ అధికారి కనీసం దీనికి ఎన్ కౌంటర్ అనే ముసుగు కూడా వేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అల్లూరిని ఎలా హతమార్చాడో కళ్ళకి కట్టారు కృష్ణ.

ఎన్టీఆర్ తాత్సారం-కృష్ణ ఉత్సాహం

సినిమాని సర్వకళా సమ్మేళనమనగానే సరిపోదు. అందులో ప్రజల చైతన్య పరిధిని విస్తృత పర్చే విషయం లేకపోతే ఆ కళలన్నీ వృధాయే. కళే ఒక సాధనం. సృజనాత్మక దృష్టితో కళల్తో ఏమైనా సాధించవచ్చు. అల్లూరి సీతారామ రాజు చరిత్ర ఫక్తు డ్రై సబ్జెక్టు అనుకుంటూ సినిమా తీయడానికి పదిహేడేళ్ళుగా ఎన్టీఆర్ తాత్సారం చేస్తూంటే, అప్పటికి 34 ఏళ్ల హీరో కృష్ణ, ఆ డ్రై నెస్ ని కాస్తా భక్తిరస పారవశ్యాలతో సస్యశ్యామలం చేసేశారు!

అల్లూరి సీతారామ రాజు అనే విప్లవ వీరుడుకి దైవత్వాన్ని కూడా ఆపాదించి నడిపిన అద్భుత సన్నివేశాలే సినిమాకి జీవం పోసి డ్రై నెస్ ని వెళ్ళగొట్టాయి. విప్లవకా

రుడి మత దృష్టి రాజకీయ నాయకుడి మత దృష్టిలా విభజించదు, కలుపుకుంటుంది. నాస్తికులైన విప్లవకారులు ఉద్యమాలు నడపడంలో విఫలమైపోతూంటారు.

విప్లవకవిత్వంలో భావ కవిత్వ వుండదు. కానీ ఈ సినిమా ఈ రూలునే బ్రేక్ చేసింది. రూల్సు బ్రేక్ చేయాలంటే అసలంటూ రూల్స్ ఏమిటో తెలిసివుండాలి. ఈ సినిమాకి ఏకైక రచయితగా త్రిపురనేని మహారథి స్థాయికి ఇదేం పెద్ద సమస్య కాదు. ఓ వైపు సామాజికంగా అమాయక గిరిజనుల కోసం పోరాడే వీరుడిగా అల్లూరిని చూపిస్తూనే, మరో వైపు కథా శిల్పం చెడకుండా- జానర్ దెబ్బ తినకుండా- అల్లూరిని మహిషాసుర మర్ధిని స్తోత్రం పాడగల పారంగతుడిగానూ చిత్రించడం ఆయనకే చెల్లింది. విప్లవపాత్రలో పురాణ పాత్ర మమేకమన్న మాట. ఇలా మెజారిటీ ప్రజల సెంటిమెంట్సుని దృష్టిలో పెట్టుకునే కళే ఎన్నాళ్ళయినా బ్రతుకుతుందని కూడా రుజువు చేశారు.

చరిత్ర పుస్తకాలు, డాక్యుమెంట్లు, పోలీసు ఫైళ్ళు, చింతపల్లి - కృష్ణ దేవిపేట అడవులు, అల్లూరి పరిచయస్థులూ ...ఇవన్నీ ఈ తొలి తెలుగు సినిమా స్కోప్ సినిమా కథా రచనలో తోడ్పడ్డాయి మహారథికి. "రెండ్రోజుల క్రితం వేసుకున్న చొక్కా ఇమ్మంటేనే ఏడుస్తున్నావ్, 200 ఏళ్ల నుంచీ పరిపాలిస్తున్న తెల్లోడు స్వరాజ్యం ఇమ్మంటే ఇస్తాడ్రా సన్నాసీ?" అన్న డైలాగు మహారథి పేల్చ గల్గారంటే, అది ఆ ప్రజల మధ్య తిరుగాడితేనే తప్ప, ఏసీ రూంలో ఎంచక్కా కొలువుదీరి చొక్కా నలక్కుండా కూర్చుంటే రాదు.

అల్లూరి మార్గమే నేటి పాదయాత్రలు

మన్యం వీరుడు అల్లూరి (1897-1924) . విశాఖ ఏజెన్సీలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టం (1882) ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే చూసి చలించాడు అల్లూరి. ఇక సమస్తం త్యజించి ఆ గిరిజనుల కోసం తెల్లవాడితో ప్రాణాంతక పోరాట బాట పట్టాడు. జీవితం నీ కిచ్చిన పిలుపుని నువ్వు నిరాకరించావంటే, నిన్ను సృష్టించిన శక్తిని నువ్వు అవమానించుకున్నట్టేనని అంటాడు రాబిన్ శర్మ- 'ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ' అన్నతన పాపులర్ పుస్తకంలో. అలా తనకి జీవితం ఇస్తున్న పిలుపు నందుకుని ఆలోచించకుండా ముందుకే సాగి పోయాడు అల్లూరి.

చదువు నైన్త్ దగ్గరే ఆగి పోవచ్చు, పాతిక నిండకుండానే అతడి రాజకీయ పరిజ్ఞానం అపారమైనది. తటాలున తుపాకీ పట్టి బరిలోకి దూకలేదు, ముందుగా కాంగ్రెస్ సభకి హాజరవుతాడు. నేతలు అక్కడ స్థానిక పరిపాలన మన చేతుల్లో వుండాలని ప్రసంగిస్తూంటారు. స్థానిక పాలన కాదు, మొత్తం దేశ పాలనే మన చేతికి రావాలని యావద్దేశ సంక్షేమాన్నీకాంక్షిస్తాడు అల్లూరి. ఆ సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటమెలా సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన చేస్తానని ప్రేమించిన సీతతో చెప్తాడు. " ఏ మార్గంలో స్వాతంత్ర్యం లభిస్తుందో, ప్రజాభిప్రాయానికీ, దేశ ప్రగతికీ ప్రయోజనకరమో గ్రహించాలంటే, ముందుగా దేశ పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలి, ప్రజా సమస్యల్ని అర్ధం జేసుకోవాలి" అని చెప్పి దేశాటనకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 'భారత్ జోడో యాత్ర' తో రాహుల్ గాంధీ చేస్తున్నది ఇదేనా?

అల్లూరి తిరిగి వచ్చి, "అజ్ఞానంలో, శోకంలో ఈ జాతి ఎంత భయంకరంగా బతుకుతోందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తం కావాలి. అందుకు విప్లవ మార్గ మొక్కటే శరణ్యం" అని సీతకి చెప్పి మళ్ళీ సాగిపోతాడు.

కాంట్రాక్టర్ల మెడలు వంచి గిరిజనులకి కూలీ డబ్బు లిప్పిస్తాడు. తగాదాలు మీరే పరిష్కరించుకోండి గానీ పోలీసుల దగ్గరికి వెళ్ళవద్దని జాగ్రత్త చెప్తాడు. కూలీ డబ్బులు కడుపు నిండా తాగడానిక్కాదనీ, మీ భార్యా బిడ్డలు కడుపు నిండా తినడానికనీ చెప్పి తాగుడు మాన్పిస్తాడు.

రూధర్ ఫర్డ్ ఆటవిక న్యాయం

గిరిజనుల దాస్య బుద్దిని ఇలా పటాపంచలు చేస్తున్న అతడి నిశబ్ద విప్లవం చూసి ఠారెత్తి పోతారు తెల్లవాడి తొత్తులు. ఇక అతను చెట్లు నరికి, పోడు వ్యవసాయం కూడా చేపట్టడంతో రసకందాయంలో పడుతుంది కథ. అప్పటికి గిరిజనుల్లో దైవ సమానుడిగా ఎదిగిన అల్లూరి తనతో బాటు అనుచరులైన ఘంటం దొర, మల్లన్న దొర, అగ్గి దొర తదితరుల్ని దళంగా చేసుకుని, బ్రిటిష్ పాలకుల మీద ప్రత్యక్ష పోరాటానికి దిగుతాడు. మొదట స్పెషల్ పోలీసుల్ని ఓడించి, చివర్న అస్సాం రైఫిల్స్ రెజిమెంటుకి చిక్కి, వైజాగ్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ ఎదుట నిలబడతాడు బందీగా చింతపల్లి అడవుల్లో. అతడి ఇంత దేశభక్తినీ, ప్రజాపోరాటాన్నీ ఏమాత్రం గుర్తించని రూథర్ ఫర్డ్- కాల్పులకి ఆదేశిస్తాడు. కానీ కాల్చబోతే సిబ్బందికి చేతులు రావు. అల్లూరిలో ఒక రాముడు, ఒక జీసస్, ఒక అల్లాయే కన్పిస్తూంటారు. ఆఖరికి విప్లవ నినాదాలతో గర్జిస్తూనే తుపాకీ గుళ్ళకి నేలకొరుగుతాడు అల్లూరి సీతారామరాజు.

ఇది ఓపెన్ మర్డర్. చేగువేరా విషయం వేరు. కనీసం ఆ బొలీవియా అధ్యక్షుడు ప్రపంచ భయంతో చేగువేరా మరణం ఎన్ కౌంటర్ లా కన్పించాలని ఆదేశించాడు. రూథర్ ఫర్డ్ ది దేని భయామూ లేని బరితెగింపు. భూమ్మీద న్యాయ వ్యవస్థకి తామే పట్టు గొమ్మలమని చెప్పుకునే బ్రిటిషర్లు ఇలా ఆటవిక న్యాయాన్ని అమలు చేయడం సిగ్గు చేటైన విషయం. దీన్ని ఎత్తి చూపిస్తున్న ఈ మహోజ్వల చిత్రరాజం ప్రయోజనం ఇంతకంటే నెరవేరడం వుండదు.

ఈ మహాయజ్ఞంలో తెర వెనుక రచయిత మహారథితో బాటు, దర్శకుడు రామచంద్ర రావు, ఆయన హఠాన్మరణంతో దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు, గీత రచయితలు సినారె, కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ...అపూర్వ సేవలందించారు. తెలుగు వీర లేవరా, వస్తాడు నారాజు వంటి ఆల్ టైం హిట్ పాటల సంగతి చెప్పుకోనక్కర్లేదు. 'తెలుగు వీర లేవరా' పాట రచనకి మహాకవి శ్రీ శ్రీకి జాతీయ ఉత్తమ గీతం అవార్డు లభించింది. అలాగే సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు రాసిన 'హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్' అనే పూర్తి ఇంగ్లీషు పాటకూడా వుంది. తెలుగు సినిమాల్లో ఇంగ్లీషు పాటకూడా ఇదే తొలిసారి.

అల్లూరికి కృష్ణ- విజయనిర్మల నివాళి

ఇక 'వస్తాడు నారాజు...' పాట తర్వాత సన్నివేశం గురించి చెప్పుకోవాలి. గానకోకిల పి. సుశీల కంఠ స్వరంలో విజయనిర్మల మీద చిత్రీకరించిన ఈ పాట భావాత్మకంగానే కాదు, ఆథ్యాత్మికంగానూ మనల్ని ఏ లోకాలకో తీసికెళ్ళి పోతుంది తనవెంట. పాట పూర్తవుతూండగా, దేశాటన ముగించుకుని కృష్ణ వస్తాడు. వెళ్తున్నప్పుడు కార్తీక పౌర్ణమి నాటికి తిరిగి వచ్చి ప్రేమ విషయంలో నిర్ణయం చెప్తానని చెప్పి వెళ్ళాడు. ఈ నిరీక్షణలోనే ఆ పాట పాడుకుందామె. ఇప్పుడతను వచ్చాక ఈ సీనుని ఎలా ప్రారంభించాలి?

విజయనిర్మల పాత్ర సీతది అంత నేలబారు పాత్రేం కాదు. ఆమె ప్రేమని ఇచ్చేదే గానీ కోరుకునేది కాదు. అతడి మనసెరిగి మాటాడే స్వభావమామెది. అప్పుడతను అలా తిరిగి ఇంటికి రాగానే చూసి తన గురించి సర్వమూ మర్చిపోయి, అతడి సంఘర్షణలో తనూ బేషరతుగా భాగస్వామిని అయిపోతున్నట్టూ, దేశాటనలో అతను పొంది వుంటాడనుకుంటున్న జ్ఞాన సంపదని వూహించుకుని ఉప్పొంగిపోతూ, ఒకే మాట అంటుంది- ఒకే మాట మెచ్యూర్డ్ గా చటుక్కున - "దేశమంతా చూశావా?" అని!

మతులు పోవాల్సిందే మనుషులకి ఇలా అన్న ఆమెని చూసి. గ్రేట్ క్యారక్టర్. పాత్ర అంతరంగ మెరిగి, పాత్రోచితంగా ఇంత గొప్ప డైలాగు సృష్టించిన మహారథి నిజంగా జీనియస్!

1965 లో రంగ ప్రవేశం చేసిన హీరో కృష్ణకి తొమ్మిదేళ్ళకే 1974 లో వందవ సినిమా ఇది! ఇవాళ్టి హీరోలు ఇది చూసి కళ్ళు తేలేయాల్సిందే. రెండు ప్రధాన పాత్రల్లో కృష్ణ- విజయనిర్మలతో బాటు, కె జగ్గయ్య రూథర్ ఫర్డ్ గా కన్పిస్తే, గుమ్మడి వెంకటేశ్వరరావు, ( ఘంటం దొర) ప్రభాకర రెడ్డి, (మల్లన్న దొర), బాలయ్య (అగ్గి దొర) మన్యం వీరులుగా కన్పిస్తారు. పేకేటి శివరాం, రాజనాల, త్యాగరాజు బ్రిటిష్ అధికారులుగానూ, కల్పిత పాత్రల్లో మోహన్ బాబు, చంద్ర మోహన్, అల్లురామలింగయ్య, కెవి చలం, రాజబాబు, మంజుల జయంతి, రాజశ్రీ కన్పిస్తే, ఓ ప్రత్యేక పాత్రలో టి ఎల్ కాంతారావు దర్శనమిస్తారు.

హిందీలో కమల్ అమ్రోహీ 'పాకీజా' తీసినప్పుడు వాడిన కెమెరాలూ లెన్సులూ తెప్పించుకునే ఈ సినిమా స్కోపు యజ్ఞానికి తెరతీశారు కృష్ణ. 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న 'అల్లూరి సీతారామ రాజు' కి రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు లభించింది. హిందీలో 'ఇంక్విలాబ్ జిందాబాద్' గా డబ్ అయింది. 'అల్లూరి సీతారామరాజు' ఒకటే కాదు, మరెన్నో ప్రయోగాలకీ, సంచలనాలకీ కేంద్రబిందువైన సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు చెరగని స్మృతులు వదిలి వెళ్ళిపోయారు.

First Published:  15 Nov 2022 5:19 AM GMT
Next Story