Telugu Global
Cinema & Entertainment

Dil Raju: ఇంకొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు.. నేను కాబట్టి నిలబడ్డా.. మరోసారి దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు

Dil Raju: ఇదిలా ఉండగా అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాలతో తీవ్రంగా నష్టపోయానని, మరొక నిర్మాత అయితే ఆత్మహత్య చేసుకునేవారని దిల్ రాజు వ్యాఖ్యానించడంపై పవన్, మహేష్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Dil Raju: ఇంకొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు.. నేను కాబట్టి నిలబడ్డా.. మరోసారి దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు
X

ఈ మధ్య నిర్మాత దిల్ రాజు వరుసగా వివాదాల్లో తల దూరుస్తున్నారు. కొద్దిరోజుల కిందట దిల్ రాజు తమిళ అగ్ర హీరోల్లో అజిత్ కంటే విజయ్ నంబర్ వన్ హీరో అని ప్రకటించి కలకలం రేపారు. మామూలుగానే తమిళనాడులో విజయ్, అజిత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. తమ హీరో గొప్పవాడు అంటే తమ హీరో గొప్పవాడు అంటూ ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ మధ్య దిల్ రాజు కామెంట్స్ చిచ్చుపెట్టాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ వివాదం జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు.

ఇదిలా ఉండగా మరోసారి దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ కి టార్గెట్‌గా మారారు. దిల్ రాజు ప్రస్తుతం విజయ్‌తో వారసుడు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుండగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2017 లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి, మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాలకు తాను డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నానని, ఈ రెండు సినిమాలు తన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్ మిగిల్చాయని పేర్కొన్నారు.

ఒకే ఏడాది రెండు భారీ ప్లాపులు రావడంతో తాను చాలా నష్టపోయినట్లు చెప్పారు. ఈ రెండు ప్లాప్‌లను తాను కాబట్టి తట్టుకొని నిలబడ్డానని, మరొకరైతే ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారని.. లేకపోతే ఆత్మహత్య చేసుకునేవారని దిల్ రాజు వ్యాఖ్యానించారు. అయితే అదే సంవత్సరం తమ సంస్థ నిర్మించిన ఆరు సినిమాలు హిట్ కావడంతో తాను ఇండస్ట్రీలో నిలబడగలిగానని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాలతో తీవ్రంగా నష్టపోయానని, మరొక నిర్మాత అయితే ఆత్మహత్య చేసుకునేవారని దిల్ రాజు వ్యాఖ్యానించడంపై పవన్, మహేష్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు నటించిన ఎన్నో హిట్ సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారని, లాభాలు వచ్చినప్పుడు ప్రకటించకుండా.. నష్టపోయిన సినిమాల గురించి ప్రకటించడం ఏమిటని వారు మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక దిల్ రాజు పవన్ నటించిన తొలిప్రేమ సినిమాతో తొలిసారి డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. ఆ తర్వాత ఆయన పవన్ నటించిన ఖుషి సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో వచ్చిన లాభాల వల్లే దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి నిర్మాతగా మారిన దిల్ రాజు ఆయన సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి తీవ్రంగా నష్టపోయానని కామెంట్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

First Published:  29 Dec 2022 7:04 AM GMT
Next Story