Telugu Global
Cinema & Entertainment

'హరిహర వీరమల్లు'కు సీక్వెల్.. ఏఎం రత్నం ప్రకటన

తాను తీస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా అయిన హరిహర వీరమల్లుకు సీక్వెల్ కూడా ఉందని ఏఎం రత్నం ప్రకటించారు.

హరిహర వీరమల్లుకు సీక్వెల్.. ఏఎం రత్నం ప్రకటన
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో నాలుగేళ్ల కిందట మొదలైన సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ మొదలై ఏళ్లు గడిచిపోతున్నప్పటికీ నిర్మాణం మాత్రం పూర్తవలేదు. ఈ సినిమా ఇక రాదు.. ఆగిపోయింది..అని ప్రచారం జరిగిన ప్రతిసారి నిర్మాత ఏఎం రత్నం మూవీ ఆగిపోలేదు..అని క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై మరోసారి ఏఎం రత్నం స్పందించారు. కీలక అప్డేట్ కూడా ఇచ్చారు.

హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని.. కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఏఎం రత్నం తెలిపారు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి డబ్బు సంపాదించుకోవాలంటే 20 రోజులు ఆయన డేట్స్ ఇస్తే ఏదో ఒకటి తీయొచ్చని, కానీ ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండి పోవాలనే హరిహర వీరమల్లు తీస్తున్నట్లు చెప్పారు.

తాను తీస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా అయిన హరిహర వీరమల్లుకు సీక్వెల్ కూడా ఉందని ఏఎం రత్నం ప్రకటించారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరో స్థాయికి వెళ్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ అయిన హరిహర వీరమల్లుకు సీక్వెల్ కూడా ఉందని నిర్మాత ప్రకటించడంతో పవన్ అభిమానులు సంబరపడుతున్నారు.

హరిహర వీరమల్లు మూవీ మొగలాయిల కాలంనాటి కథతో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నాడు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  27 Feb 2024 10:25 AM GMT
Next Story