Telugu Global
Cinema & Entertainment

గూఢచారికి సీక్వెల్.. ప్రకటించిన అడివి శేష్

జీ2 మూవీని భారీ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. జనవరి 9న ముంబైలో జరిగే ఒక గ్రాండ్ ఈవెంట్‌లో జీ2 కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

గూఢచారికి సీక్వెల్.. ప్రకటించిన అడివి శేష్
X

చిన్న చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి ఇండియా మొత్తం ఇమేజ్ సంపాదించుకున్న నటుడు అడివి శేష్. 2010లో కర్మ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అడివి శేష్. ఈ సినిమాకు దర్శకుడు కూడా అతడే. అయితే ఆ మూవీ ప్లాప్ కావడంతో శేష్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. హీరోగా క్షణం మూవీ శేష్ కి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత శేష్ కథ అందించగా శశికిరణ్ దర్శకత్వం వహించిన గూఢచారి భారీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాను లో బడ్జెట్‌లోనే హాలీవుడ్ స్థాయి స్టాండర్డ్స్ తో తీర్చిదిద్దారు. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని.. కొంతకాలంగా శేష్ చెబుతూ వస్తున్నాడు. ఇవాళ గూఢచారి సినిమాకు సీక్వెల్‌ను జీ2 పేరుతో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో శేష్ ఓ గన్ పట్టుకున్నట్లు సైడ్ యాంగిల్‌లో చూపించారు. క్షణం సినిమా నుంచి మేజర్ వరకు వరుసగా నాలుగు సినిమాలు హిట్ కావడం.. ఇటీవల శేష్ చేసిన హిట్- 2 మూవీ భారీ విజయం సాధించడంతో జీ2ని పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో నిర్మించనున్నారు.

మరోసారి శేష్ ఈ మూవీకి కథ అందిస్తున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాకు దర్శకుడు మారాడు. గూఢచారికి దర్శకత్వం వహించిన శశికిరణ్ స్థానంలో వినయ్ కుమార్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఇతడు గూఢచారి సినిమాకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. వినయ్ కుమార్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా.

జీ2 మూవీని భారీ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. జనవరి 9న ముంబైలో జరిగే ఒక గ్రాండ్ ఈవెంట్ లో జీ2 కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శేష్ నటించిన మేజర్ సినిమా హిందీలోనూ సూపర్ హిట్ కావడంతో జీ2 తొలి ఈవెంట్ ముంబైలో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు.

First Published:  30 Dec 2022 2:29 PM GMT
Next Story