Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్లు సంపాదించారు.. మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు

మన్సూర్ అలీఖాన్ మరోసారి చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి పార్టీ పెట్టి రూ.1000 కోట్లు సంపాదించారని ఆరోపించాడు. ఆ డబ్బును తన సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించాడు.

చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్లు సంపాదించారు.. మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు
X

హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మన్సూర్ వ్యాఖ్యలను పలువురు నటీనటులు తప్పుపట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అతడిది వక్రబుద్ధి అని విమర్శించారు. త్రిష విషయంలో మన్సూర్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయినప్పటికీ మన్సూర్ వెనక్కి తగ్గలేదు. ముందు ఎవరికీ క్షమాపణ చెప్పనని చెప్పిన మన్సూర్ ఆ తర్వాత వెనక్కు తగ్గి త్రిషకు క్షమాపణలు చెప్పాడు.

అయితే ఇంతటితో ఈ వివాదాన్ని మన్సూర్ ముగించలేదు. త్రిషకు క్షమాపణ చెప్పిన మరుసటి రోజే చిరంజీవి, త్రిష, కుష్బూలపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు మన్సూర్ అలీఖాన్ మరోసారి చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి పార్టీ పెట్టి రూ.1000 కోట్లు సంపాదించారని ఆరోపించాడు. ఆ డబ్బును తన సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించాడు. మరి జనం కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని నిలదీశాడు. దీనిని బట్టి చిరంజీవిది వక్రబుద్ధి అని మన్సూర్ విమర్శించాడు.

చిరంజీవిపై రూ.20 కోట్లు, త్రిష కుష్బూలపై రూ.10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించాడు. ఈ డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తానని చెప్పాడు. త్రిష ఇష్యూ విషయంలో చిరంజీవి తప్పు చేశారని మన్సూర్ అన్నాడు. ఏం జరిగిందో తనకు ఫోన్ చేసి అడిగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అలా చేయకుండా తనను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించాడు. చిరంజీవి పార్టీ పెట్టి రూ.వెయ్యి కోట్లు సంపాదించారని మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

First Published:  28 Nov 2023 11:15 AM GMT
Next Story