Telugu Global
Cinema & Entertainment

ఆ ముగ్గురిపై మన్సూర్ పరువు నష్టం దావా

తాను మాట్లాడిన వీడియో మొత్తం చూడకుండానే ఆ ముగ్గురు తన పరువుకు భంగం కలిగించే విధంగా విమర్శలు చేశారని మన్సూర్ అలీ ఖాన్ ఆరోపించాడు.

ఆ ముగ్గురిపై మన్సూర్ పరువు నష్టం దావా
X

నటుడు మన్సూర్ అలీఖాన్ అన్నంత పని చేసేశాడు. త్రిష, కుష్బూ, చిరంజీవిపై శుక్రవారం మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. తమిళ అగ్ర హీరో విజయ్, త్రిష హీరో, హీరోయిన్లుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇటీవల `లియో` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

సినిమాలో మన్సూర్ అలీఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మన్సూర్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. తాను గతంలో చాలా సినిమాల్లో రేప్ సీన్లలో నటించానని, లియోలో కూడా త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని.. అయితే అలాంటి సీన్ ఒక్కటి కూడా పెట్టకపోవడం బాధ కలిగించిందని వ్యాఖ్యానించాడు. మన్సూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి, కుష్బూ, నితిన్, రోజా, రాధిక, లోకేష్ కనగరాజ్ తదితరులు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన కుష్బూ ఈ విషయమై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మన్సూర్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సమర్థించుకున్న మన్సూర్ తనపై విమర్శలు చేసిన త్రిష, చిరంజీవి, కుష్బూలపై పరువు నష్టం దావా వేస్తానని కొద్ది రోజుల కిందట ప్రకటించాడు.

ఇప్పుడు మన్సూర్ అన్నట్లుగానే చేశాడు. ఆ ముగ్గురిపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశాడు. రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని కోరాడు. తాను మాట్లాడిన వీడియో మొత్తం చూడకుండానే ఆ ముగ్గురు తన పరువుకు భంగం కలిగించే విధంగా విమర్శలు చేశారని మన్సూర్ అలీ ఖాన్ ఆరోపించాడు. ఈ కేసు డిసెంబర్ 11న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

First Published:  9 Dec 2023 8:43 AM GMT
Next Story