Telugu Global
Business

బైక్ ట్యాక్సీలుగా ఎలక్ట్రానిక్ వాహనాలకే అనుమతి.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

అయితే తాజాగా కేజ్రీవాల్ సర్కార్ ఎలక్ట్రానిక్ వాహనాలను బైక్ ట్యాక్సీలుగా నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మోటర్ వెహికల్ అగ్రిగేటర్ స్కీమ్, 2023కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

బైక్ ట్యాక్సీలుగా ఎలక్ట్రానిక్ వాహనాలకే అనుమతి.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
X

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా నియంత్రణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ బాణసంచాను నిషేధించింది. రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ క్రమంలో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీ వాహనాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. అయితే తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను బైక్ ట్యాక్సీలుగా నడుపుకొనేందుకు అనుమతి ఇచ్చింది.

ఢిల్లీలో గంటల ప్రాతిపదికన రెంట్ కు నడిచే ద్విచక్ర వాహనాలు, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలు రోడ్లపై తిరగకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి వాహనాలను నడిపితే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో అప్పట్నుంచి దేశ రాజధాని నగరంలో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీ సంస్థలు తమ వాహనాలను నిలిపేశాయి.

అయితే తాజాగా కేజ్రీవాల్ సర్కార్ ఎలక్ట్రానిక్ వాహనాలను బైక్ ట్యాక్సీలుగా నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మోటర్ వెహికల్ అగ్రిగేటర్ స్కీమ్, 2023కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. సంబంధిత ముసాయిదాను లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ వీకే సక్సేనా కార్యాలయానికి పంపారు. ఈ పథకానికి ప్రతిరూపం ఇచ్చే ముందు ప్రజలనుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మూడు నెలల తర్వాత మళ్లీ నగరంలో బైక్ ట్యాక్సీలు దర్శనం ఇవ్వనున్నాయి. అయితే ఈసారి పెట్రోల్ వాహనాల స్థానంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే బైక్ ట్యాక్సీలుగా కనిపించనున్నాయి.

First Published:  11 May 2023 4:04 AM GMT
Next Story