Telugu Global
Business

టాప్ గేర్ లో లగ్జరీ కార్ల సేల్స్.. ఇవీ కారణాలు ..!

ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అంచ‌నాల మేర‌కు 2023లో 46 వేల నుంచి 47 వేల ల‌గ్జ‌రీ కార్లు అమ్ముడ‌య్యాయి. 2022తో పోలిస్తే 21 శాతం (38 వేలుకు పైగా), కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌చ్చిన 2019కి ముందుతో పోలిస్తే గ‌తేడాది 35 శాతం పై చిలుకు లగ్జ‌రీ కార్ల విక్ర‌యాల్లో గ‌ణ‌నీయ వృద్ధిరేటు న‌మోదైంది.

ఆ కార్ల‌పైనే యువ‌త‌రం మోజు.. టాప్ గేర్‌లో ల‌గ్జ‌రీ కార్ల సేల్స‌.. ఇవీ కార‌ణాలు..!
X

గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ప‌ర్స‌న‌ల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా విశాలమైన స్పేస్ గ‌ల ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి త‌ర్వాత యువ ప్రొఫెష‌న‌ల్స్ లైఫ్ స్ట‌యిల్‌లో మార్పులు వ‌చ్చాయి. హై ఎండ్ కార్లు, ల‌గ్జ‌రీ కార్ల వైపు మొగ్గుతున్నారు. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారికి ముందు అంటే 2019లో ప్ర‌తి రోజూ రూ.50 ల‌క్ష‌ల పై చిలుకు గ‌ల ధ‌ర గ‌ల కార్లు 95 అమ్ముడైతే 2023లో స‌గ‌టున 128 కార్లు అమ్ముడ‌య్యాయి. దీనికి ప్ర‌తి ఒక్క‌రి ఆదాయం పెర‌గ‌డం కూడా దీనికి మ‌రో కార‌ణం అని తెలుస్తోంది.

ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అంచ‌నాల మేర‌కు 2023లో 46 వేల నుంచి 47 వేల ల‌గ్జ‌రీ కార్లు అమ్ముడ‌య్యాయి. 2022తో పోలిస్తే 21 శాతం (38 వేలుకు పైగా), కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌చ్చిన 2019కి ముందుతో పోలిస్తే గ‌తేడాది 35 శాతం పై చిలుకు లగ్జ‌రీ కార్ల విక్ర‌యాల్లో గ‌ణ‌నీయ వృద్ధిరేటు న‌మోదైంది. వీటిల్లో మెర్సిడెజ్‌-బెంజ్‌, బీఎండ‌బ్ల్యూ కార్లు మొద‌టి స్థానంలో ఉంటాయి. 2023లో కార్ల విక్ర‌యాల గ‌ణాంకాల‌ను ఈ రెండు సంస్థ‌లు ప్ర‌క‌టించ‌లేదు కానీ, మ‌రో ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ ఆడి ఇండియా 2022తో పోలిస్తే 2023లో 89 శాతం సేల్స్ పెరిగాయి. 2022లో 4,187 కార్లు విక్ర‌యించిన ఆడి ఇండియా.. 2023లో 7,931 యూనిట్ల‌ను విక్ర‌యించింది. ఇది ఓవరాల్ ఇండ‌స్ట్రీ గ్రోత్‌ను దాటేసింది.

వేత‌న జీవులు, వైద్యులు, చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు (సీఏ) నుంచి ల‌గ్జ‌రీ కార్ల‌కు 2023లో మంచి గిరాకీ ఏర్ప‌డింద‌ని ఆడి ఇండియా హెడ్ బ‌ల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. గ‌తంలో సంప్ర‌దాయ వ్యాపార‌వేత్త‌లు మాత్ర‌మే ల‌గ్జ‌రీ కార్లు కొనుగోలు చేసేవార‌న్నారు. కానీ జీవితంలో ఒక్క‌సారి మాత్ర‌మే కొనుగోలు చేస్తామ‌న్న పేరుతో ఎక్కువ ఆదాయ వ‌ర్గాల వారంతా ల‌గ్జ‌రీ కార్ల కొనుగోలుకు ప్రియారిటీ ఇస్తున్నార‌ని చెప్పారు. త‌మ ల‌గ్జ‌రీ కార్ల కొనుగోలు దారుల్లో 42 శాతం మంది 40 ఏండ్ల లోపు వారేన‌న్నారు. ఇంత‌కుముందు 50 ఏండ్లు దాటిన వారు మాత్ర‌మే రూ.50 ల‌క్ష‌ల పై చిలుకు కార్లు కొనుగోలు చేసేవార‌ని, ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్దకు సంప‌ద విస్త‌రిస్తోంద‌నడానికి ఇది సంకేతం అని చెప్పారు. మొత్తం త‌మ కార్ల కొనుగోలు దారుల్లో 58 శాతం మంది 50 ఏండ్ల లోపు వారేన‌న్నారు.

మ‌రో ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్ కార్ల కొనుగోలు క‌స్ట‌మ‌ర్ వ‌య‌స్సు స‌గ‌టున 38 ఏండ్లు ఉంటున్న‌ది. సీ-క్లాస్ కార్లు కొనే వారి వ‌య‌స్సు 35 ఏండ్లే.. స‌రిగ్గా ఐదేండ్ల క్రితం 45 ఏండ్లు దాటిన వారు మాత్ర‌మే ఈ కార్లు కొనుగోలు చేసే వారు. గ‌త రెండేండ్ల‌లో ల‌గ్జ‌రీ కార్ల కొనుగోలుదారుల్లో వృత్తి నిపుణులు 15 శాతం అంటే రెండింత‌ల‌కంటే పెరిగారు. కార్ల విక్రయాల్లో 2023 త‌మ‌కు బెస్ట్ అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్ట‌ర్ సంతోష్ అయ్య‌ర్ చెప్పారు.

ఇక బీఎండ‌బ్ల్యూ కార్ల కొనుగోలుదారుల్లో మెజారిటీ 35-40 ఏండ్ల‌లోపు వారే. భార‌త్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ల‌గ్జ‌రీ కార్ల విక్ర‌యాలు ఒక శాతం పై చిలుకు మాత్ర‌మే. సంప‌న్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌. తైవాన్‌లో ల‌గ్జ‌రీ కార్ల విక్ర‌యాలు 20 వాతం ఉంటాయ‌ని ఆడి ఇండియా హెడ్ బ‌ల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. వృత్తి నిపుణులు, వైద్యులు, లాయ‌ర్లు, స్టార్ట‌ప్ పారిశ్రామిక‌వేత్త‌ల చేతిలో మ‌నీ ఉండ‌టంతో ల‌గ్జ‌రీ కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయ‌ని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. భార‌త్‌లో వ్య‌క్తిగ‌త త‌ల‌స‌రి ఆదాయం సుమారు 2500 డాల‌ర్లు, ఇది ప‌లు ద‌క్షిణాసియా దేశాల్లో చాలా ఎక్కువ‌. ఆదాయం స్థాయి పెరుగుతున్నా కొద్దీ ల‌గ్జ‌రీ కార్ల విక్ర‌యాలు పుంజుకుంటాయ‌ని బ‌ల్బీర్‌సింగ్ ధిల్లాన్ చెప్పారు.

పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎల‌క్ట్రిక్ కార్ల వైపు మ‌ళ్లడం కూడా ల‌గ్జ‌రీ కార్ల విక్ర‌యాలు పెరగ‌డానికి కార‌ణం అని ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ‌ర్లు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ కార్ల‌పై 48-50 శాతం జీఎస్టీ విధిస్తే, ఎల‌క్ట్రిక్ కార్ల‌పై కేవ‌లం ఐదు శాత‌మే. ఇక భార‌త్‌లోనే ఎల‌క్ట్రిక్ కార్ల అసెంబ్లింగ్ ప్ర‌క్రియ ప్రారంభిస్తే ఈవీ కార్ల ధ‌ర‌లు మ‌రింత దిగి వ‌స్తాయి. ఆడి ఇండియా కూడా దేశీయంగా కార్ల అసెంబ్లీంగ్‌కు గ‌ల ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేస్తుంద‌న్నారు బ‌ల్బీర్ సింగ్ ధిల్లాన్‌. వచ్చే ఐదేండ్ల‌లో ఎల‌క్ట్రిక్ కార్ల‌లో దాదాపు స‌గం ల‌గ్జ‌రీ కార్లే ఉంటాయ‌ని అంచ‌నా వేశారు.

ఇంట‌ర్న‌ల్ కంబుస్ట‌న్ ఇంజిన్ వెహిక‌ల్స్ దిగుమ‌తిపై అధిక క‌స్ట‌మ్స్ సుంకాలు, జీఎస్టీ, రోడ్డు టాక్స్ త‌దిత‌ర చార్జీలు త‌డిసి మోపెడ‌వుతాయి. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న‌ లగ్జ‌రీ కార్ల ధ‌ర‌లు నాలుగు రెట్లు పెర‌గ‌డానికి వివిధ ప‌న్నులు కూడా కార‌ణ‌మే. ఇదిలా ఉంటే 2023లో చౌక ధ‌ర‌కు ల‌భించి సెడాన్‌లు, యుటిలిటీ వెహిక‌ల్స్ త‌దిత‌ర కార్లు 41 ల‌క్ష‌ల మార్క్‌ను దాటేశాయి.

First Published:  8 Jan 2024 10:29 AM GMT
Next Story