Telugu Global
Business

చైనా మొబైల్స్‌కు చెక్?

రూ.12వేల లోపు ధర ఉన్న మొబైళ్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశీయ మొబైల్‌ కంపెనీలకు ఊతమిచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

చైనా మొబైల్స్‌కు చెక్?
X

భారత ప్రభుత్వం చైనా మార్కెట్‌కు మరోసారి పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది. గతంలో చైనాకు చెందిన యాప్స్‌ను మాత్రమే నిషేధిస్తే ఇప్పుడు ఏకంగా మొబైల్స్‌ను బ్యాన్ చేసే ప్లాన్‌లో ఉంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.12వేల లోపు ధర ఉన్న మొబైళ్లను భారత్‌లో విక్రయించకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేశీయ మొబైల్‌ కంపెనీలకు ఊతమిచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

గతంలో చైనా మొబైల్స్‌ అయిన షావోమీ, వివో, ఒప్పోలతో పాటు లావా, మైక్రోమ్యాక్స్‌, సెల్‌కాన్ లాంటి దేశీయ మొబైల్ ఫోన్లు కూడా ఎక్కువగా కనిపించేవి. అయితే చైనా పాటిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటెజీ, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడం కారణంగా దేశీయ బ్రాండ్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. దేశవ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలే ఇండియన్ మార్కెట్‌పై గట్టి పట్టు సాధించాయి. బడ్జెట్‌ ఫోన్‌ విక్రయాల్లో వీటిదే హవా. రూ.12వేల లోపు ధరలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో చైనా కంపెనీల వాటానే 80 శాతం ఉందంటే మార్కెట్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చైనీస్ కంపెనీలకు చెక్‌ పెట్టేందుకు రూ.12వేల ధరలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్థిక అవకతవకల ఆరోపణలపై షావోమి, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో సుమారు 300 చైనా యాప్స్‌పై భారత్‌ నిషేధం విధించింది. దేశ భద్రతల కారణంగా చైనాకు చెందిన జడ్‌టీఈ, హువావే కంపెనీల టెలికాం పరికరాలపైనా భారత్‌ ఆంక్షలు విధించింది. ఇప్పుడు కొత్తగా మొబైల్ బ్రాండ్స్ పై నిషేధం విధించనుంది. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే షావోమి, ఒప్పో, వివో, రియల్‌మీ వంటి కంపెనీలకు గట్టిదెబ్బ తగిలినా.. దేశీయ మొబైల్ కంపెనీలకు కాస్త లాభం ఉండే అవకాశం కనిపిస్తోంది.

First Published:  9 Aug 2022 6:45 AM GMT
Next Story