Telugu Global
Business

మూడు రోజుల్లో 34 బిలియన్ డాలర్లు హాంఫట్.. 11వ స్థానానికి పడిపోయిన అదానీ

కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలో అదానీ ఆస్తులు 34 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ.. తాజాగా 11వ స్థానానికి పడిపోయారు.

మూడు రోజుల్లో 34 బిలియన్ డాలర్లు హాంఫట్.. 11వ స్థానానికి పడిపోయిన అదానీ
X

భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ ప్రపంచ టాప్ 10 బిలియనీర్ల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూప్ షేర్లు గత ఐదేళ్లలో భారీగా పెరగడం వెనుక ఉన్న నిజానిజాలను అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ అనే స్పెకులేటీవ్ సంస్థ బయట పెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. దీంతో రియల్ టైమ్ మార్కెట్ విలువ ఆధారంగా అదానీ కూడా తన చోటును కోల్పోయారు.

కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలో అదానీ ఆస్తులు 34 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ.. తాజాగా 11వ స్థానానికి పడిపోయారు. అదానీ ప్రస్తుత ఆస్తుల విలువ 84.4 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 82.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్లు మూడు రోజుల్లో 68 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి.

ప్రపంచ నెంబర్ వన్ బిలియనీర్‌గా ఉన్న ఎలాన్ మస్క్ కూడా రెండో స్థానానికి పడిపోయారు. టెస్లా షేర్లు పతనం కావడంతో ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న ఫ్రెంచ్ బిజినెస్ మ్యాగ్నెట్ బెర్నార్డ్ అర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు. అదానీ షేర్ల పతనానికి హిండెన్‌బర్గ్ నివేదికే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదానీ షేర్ల డెరివేటివ్, బాండ్ డెరివేటీవ్‌లలో షార్ట్ పొజిషన్ తీసుకున్నామని ప్రకటించింది. నివేదిక రావడానికి ముందే అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు అదానీ షేర్లు పడిపోవడంతో హిండెన్‌బర్గ్‌కు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది.

First Published:  31 Jan 2023 11:17 AM GMT
Next Story