Telugu Global
Arts & Literature

వందేళ్ల ఏకాంతం (నవల పరిచయం)

వందేళ్ల ఏకాంతం (నవల పరిచయం)
X

వందేళ్ల ఏకాంతం (నవల పరిచయం)

వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ నవలను ఎవరైనా అనువదిస్తే బావుంటుందని చాలా ఏళ్ల నుంచి ఓ ఎదురుచూపు. ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదని నిరాశ. నేనే ఎందుకు చెయ్యకూడదని అప్పుడప్పుడూ అనిపించి, మొత్తానికి శ్రమించి చేశా. నవలకు పరిచయ వాక్యాలు ఇవి :

మన కాలపు మహా ఇతిహాసం

---------------------------

స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్‌ను , ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన 'వందేళ్ల ఏకాంతం' నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. 1967లో వెలువడిన ఈ 'సియెన్ అనోస్ దె సొలెదాద్' ఇప్పటికి యాభైకి పైగా భాషల్లో అనువాదమై ఐదు కోట్ల ప్రతులు అచ్చయింది. స్పానిష్ బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇదేనంటారు. మేజిక్ రియలిజం పేరు వినగానే ఇదే గుర్తొస్తుంది. యాభై ఏళ్లుగా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్న ఈ నవలపై కొన్ని వేల పేజీల విమర్శ. విశ్లేషణ వెలువడ్డాయి. ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే పుస్తకాలు కూడా. కొందరు దీన్ని మనకాలపు మహా ఇతిహాసమని కొనియాడితే, కొందరు కొరకరాని కొయ్య అని, గాఢత లేదని పెదవి విరిచారు. దూషణభూషణలతో నిమిత్తం లేకుండా ప్రతి తరమూ దీన్ని చదువుతోంది. చదివిన తరాలు మళ్లీ మళ్లీ చదువుతున్నాయి.

తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, మోహాలు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ. మార్క్వెజ్‌కు సంస్కృతంపై, అమెరికాయేతర, యూరపేతర నాగరికతలపై ఉన్న ఆసక్తి వల్ల అతనితో ఆ భాషలో రాయించి ఉండొచ్చు. బాల్యంలో మార్క్వెజ్‌కు కథలు చెప్పిన అమ్మమ్మ మౌఖిక కథన సంప్రదాయం, మెల్కియాదిస్ లిఖిత సంప్రదాయం రెండూ కథనంలో కనిపిస్తాయి.

"పందితోక పిల్లాడు పుట్టకుండా ఓ కుటుంబం వందేళ్లపాటు ఎన్ని తిప్పలు పడిందో చెప్పడానికే ఈ నవల రాశాను," అన్నాడు మార్క్వెజ్. సరదాగా అనిపించినా నిజమైతే అదే. కాకపోతే ఆ కుటుంబపు వందేళ్ల చరిత్ర సామాజిక ఉత్థానపతనాలతోనూ, కౌటింబిక, వైయక్తిక ఏకాంతంతోనూ గాఢంగా పెనవేసుకుని ఉండడంతో మొయ్యలేనంత గాంభీర్యం సంతరించుకుంది. గిలిగింతలు పెట్టే, చురుక్కుమనిపించే హాస్యం ఆ సంక్షోభాల, మాంత్రిక వాస్తవాల చరిత్రకు ఓ చక్కెర పూత మాత్రమే. ఆ పూత కింద వెచ్చని నెత్తుటితో రగిలే అలవిగాని కోరికలు, ఒళ్లు జలదరించే భయాలు, చెదిరిన కలలు, చల్లారిన విప్లవాలు, కొన ఊపిరి ఆశలు, బిక్కుబిక్కుమనే ఏకాంతాలు మరెన్నో ఉంటాయి. అవన్నీ సార్వజనీన అనుభవాలు కనకే 'వందేళ్ల ఏకాంతం' ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.

మార్క్వెజ్ పుట్టి పెరిగిన కొలంబియాలోని అరకటాకా ఊరికి కాల్పనిక ప్రతిబింబిం మకోందో. స్పానిష్ వలసపాలన ముగింపు దశ నుంచి ఇరవయో శతాబ్ది తొలి మూడు దశకాల (1820-1930) వరకు లాటిన్ అమెరికా సామాజిక, రాజకీయార్థిక చరిత్ర మొత్తం ఈ ఊరి ప్రస్థానంలో ప్రతిఫలిస్తుంది. సమానత్వ విలువలతో అవతరించిన మకోందో కాలక్రమంలో రైళ్లు, టెలిఫోన్లు, సినిమాలు, సామ్రాజ్యవాద పెట్టుబళ్ల అభివృద్ధి వెలుగు నీడల్లో ఎలా నలిగి, ధ్వంసమై నేలపై ఆనవాళ్లే లేకుండా తుడిచిపెట్టుకుపోయిందో మార్క్వెజ్ 'నవరస' కథనంతో పరిచయం చేస్తాడు. బుయెందియాల కుటుంబపు ఏడు తరాల ఏకాంత కథ కాలక్రమంలోనే సాగినా వర్తమానం తరచూ గతంలోకి, భవిష్యత్తులోకి తొంగి చూస్తూ త్రికాలాల ఉత్కంఠతోపాటు కాస్త తడబాటుకూ దారితీస్తుంటుంది. ప్రతి తరంలో పునరావృతమయ్యే అర్కాదియో, ఔరెలియానో పేర్లు, చేష్టలు మరో సవాలు.

కల్పనకు మించిన కల్పనలా తోచే వాస్తవికత ఈ నవలకు ఆయువుపట్టు. ఇందులోని చాలా పాత్రలు, సంఘటనలు నిజమైనవే. రచయిత ఈతిబాధలూ, ఏకాంతమూ ఉన్నాయి. కన్జర్వేటివులతో తలపడే లిబరళ్ల యోధుడు కర్నల్ ఔరెలియానో బుయెందియాకు, మార్క్వెజ్ తాత కర్నల్ నికోలస్ మార్క్వెజ్‌తో చాలా పోలికలు ఉన్నాయి. అరటి కంపెనీకి చెందిన వందలాది కార్మికులను సైన్యం కాల్చిచంపిన ఉదంతం 1928లో అరకటాకాకు దగ్గర్లో జరిగినదే. తను పుట్టిన మట్టిని, అక్కడి మనుషులను మార్క్వెజ్ ఈ నవలతోపాటు చాలా రచనల్లో పరిచయం చేస్తాడు. మార్క్వెజ్ ఈ నవలను పద్దెనిమిది నెలలపాటు అప్పుల మధ్య రోజూ అదే పనిగా రాశాడు. అంతకు ఇరవయ్యేళ్లముందే ఆయన ఊహల్లో, రచనల్లో నమోదవుతూ వస్తున్న మకోందో సహా అనేక పాత్రలు ఇందులో చేరాయి.

మార్క్వెజ్ వామపక్ష అభిమాని. రచనల్లోనే కాదు, ఆచరణలోనూ దాన్ని చూపాడు. లాటిన్ అమెరికాలో సామ్యవాద స్వప్నం ఫలించాలని మనసారా కోరుకున్నాడు. తనకొచ్చిన బహుమతులు సొమ్మును ప్రజా ఉద్యమాలకు విరాళంగా ఇచ్చాడు. శాంతి చర్చల్లో పాల్గొన్నాడు. నోబెల్ బహుమతి ఆయన కీర్తిని ఇనుమడింపచేసినా, అంతకుమించిన గుర్తింపు పాఠకుల ఆదరా భిమానాలే. "ప్రేమే సత్యమైన, సుఖశాంతులతో వర్ధిల్లే, మానవ హననాలకు తావులేని, శాపగ్రస్తులను సైతం చేరదీసే సమాజం," ఆయన ఆకాంక్ష.

'వందేళ్ల ఏకాంతం' అనువాదానికి సులభంగా లొంగేది కాకపోయినా ప్రయత్నం చేశాను. లోటుపాట్లు ఉండొచ్చు. వాటిని నా దృష్టికి తీసుకొస్తే తప్పక దిద్దుకుంటాను.

వందేళ్ల ఏకాంతం (నవల)

గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్

పేజీలు: 264

వెల రూ. 220

పుస్తకం కోరేవాళ్లు 99490 52916 మొబైల్ నంబరుకు ఫోన్ చేయచ్చు

పి .మోహన్

First Published:  6 Dec 2022 6:33 AM GMT
Next Story