Telugu Global
Arts & Literature

ప్రాచీనంలోని నవ్యతను నిరూపించిన ఆధునికుడు కెకెఆర్

ప్రాచీనంలోని నవ్యతను నిరూపించిన ఆధునికుడు కెకెఆర్
X

తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు రచయితలు ఉన్నారు. వీరిలో కొందరు ప్రాచీన సాహిత్య మార్గాన్ని అనుసరించారు. మరి కొందరు ఆధునిక సాహిత్యాన్ని అనుసరించారు. అరుదుగా కొందరు రెండింటినీ అనుసరించారు. వీరు రెండింటిని అనుసరించినప్పటికీ ఒక్కొక్క దానిని ఒక్కో ప్రత్యేక దృష్టితో చూస్తూ రెండింటికి భేదాన్ని పాటించేవారు.

ప్రాచీన సాహిత్యంను అవలంబించే వారికి ఆధునికo నచ్చకపోవచ్చు. ఆధునిక భావజాలం అలవాటు ఉన్నవారికి ప్రాచీన సాహిత్య అంశాలు మింగుడు పడకపోవచ్చు. కానీ సాహిత్య చరిత్రలో తొలిసారిగా ప్రాచీన సాహిత్యంను ఆధునిక కోణంలో పరిశీలించిన వారిలో అగ్రగణ్యులు కె.కె.రంగనాథాచార్యులు.

భావజాలం అన్న పేరుతో ఆధునిక రచయితలంతా ప్రాచీన సాహిత్యంను పూర్తిగా విస్మరిస్తున్నారు. సాహిత్య ప్రగతికి అది అవరోధంగా మారగలదు. సాహిత్య విమర్శ యొక్క ముఖ్య లక్షణం సాహిత్యం కాదు అందులోని సాహిత్యత అంటూ ప్రాచీన సాహిత్యంను ఆధునిక కోణంలో వివరించారు.

ఆధునికత అంటే సాహిత్య ప్రక్రియలో మార్పు కాదు సాహిత్య అంశాలలోనూ/ ఆలోచనా విధానంలోను/సాహిత్యత ప్రసరణ లోనూ మార్పు అన్నారు.

కెకె ఆర్ -కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు గొప్ప విమర్శకుడు,సాహిత్య చరిత్రకారులు, సంస్కరణవాది, హేతువాది, శాస్త్రీయ వాద పరిశోధకులు, అభ్యుదయ వాది మరియువిప్లవవాది మరియు ఉత్తమ అధ్యాపకులుగా ప్రసిద్ధి పొందారు.

వీరు తమ రచనల్లో సాహిత్యం-చరిత్ర-సమాజం మధ్య గల సంబంధంను కళాత్మకంగా, క్షుణ్నంగా వివరించారు.

వీరిది గొప్ప సాంప్రదాయ సాహిత్య నేపథ్యం అయినప్పటికీ వీరు ప్రాచీన సాహిత్యంను ఎంతగా ఆదరించారో దానికి సమానంగా ఆధునిక సాహిత్యంను కూడా ఆదరించారు.

వీరికి కేవలం భాషాశాస్త్రం పై మాత్రమే కాక సాహిత్యంపై కూడా నైపుణ్యం కలదు. మార్క్సిజం భావజాల పునాదిగా సాహిత్య, భాషా శాస్త్రాలను ఇతర సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేశారు.

ఆధునికత ,హేతుబద్ధత, తార్కికత, శాస్త్రీయత వీరి రచనల్లో ప్రస్ఫుటంగా కానవస్తాయి.

రంగనాథాచారి గారు పూర్వపు రచయితల సమాచారాన్ని గుడ్డిగా అనుసరించక అందులోని వాస్తవికతను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అందులోని అంశాలను గురించి క్షుణ్ణంగా సమగ్రంగా వివరిస్తూ రచనలు చేయడంవీరిప్రత్యేకత.

ఒక విషయాన్ని అభివ్యక్తి కరించే పద్ధతిలోని కళాత్మక విలువలను బట్టి ఒక రచనను సాహిత్య రచన లేదా సృజనాత్మక రచన అనీ నిర్దేశించవచ్చు. కానీ ఆ అభివ్యక్తీకరణ పద్ధతిని, రచన రూపాన్ని నిర్ణయించేది కవి యొక్క సామాజిక అస్తిత్వం లేదా కవి ఆశించే ప్రయోజనం మాత్రమే. కావున కవిత్వం అనేది మానవుని సమకాలీన సామాజిక అస్తిత్వం నుండే పుడుతుంది . సాహిత్యం అంటే సంస్కృతి ప్రతిబింబింపనిచేసేది అని అర్థం.

ఆ నాటి సంస్కృతి ఆధ్యాత్మిక విలువలు ప్రధానంగా కలిగి, మతం,చట్టం, సాహిత్యం, సంగీతం, చిత్రకళ మొదలగు అన్నింటిలోనూ ఆధ్యాత్మికత ప్రభావంనే ప్రతిబింబించేసేది. అలా ఆ నాటి కవులకు పండితులకు అదే నిజమైన సంస్కృతిగా కనపడేది. కాబట్టి వారు వాటినే సాహిత్య అంశాలు ఎన్నుకునే వారు.

నేటి భావజాల రచయితలకు ప్రాచీన సాహిత్యం పనికిరాని దిగాకనపడవచ్చు.ఇతివృత్తం దృష్ట్యా నేటి రచయితలంతా ఆనాటి ప్రాచీన సాహిత్యంను అంగీకరించక పోయినప్పటికీ నేటి సాహిత్యానికి మూలమైన ఆనాటి సాహిత్యతను మాత్రం పరిశీలించవలసినదే అని ప్రాచీన సాహిత్యంను ఆధునిక కోణంలో పరిశీలించారు.

అందరిలా సాహిత్యం ద్వారా చరిత్రను మరియు సమాజంను చూడకుండా చరిత్ర మరియు సమాజం ద్వారా సాహిత్యం కు విలువ కట్టే వారు.

వీరు గొప్ప రచయిత గానే కాక ఉత్తమ విమర్శకునిగా కూడా పేరుగాంచారు. సమకాలీన విమర్శలో అరుదుగా కనిపించే సూక్ష్మ పరిశీలన ,సూటిదనం వీరి రచనల్లో ప్రస్ఫుటంగా కానవస్తాయి.

వీరు దిగంబర కవులపై సైతం విమర్శనా వ్యాసాలు రాస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కొత్త ఆలోచన నేపథ్యంలో దిగంబర కవిత్వంను ఎలా చూడాలోచెప్పారు.

వీరి అనేక వ్యాసాలు,రేడియో ప్రసంగాలు, గ్రంథాలకు పీఠికలు రాశారు. వీరి వ్యాసాల్లో విషయ సమగ్రత, శైలి సాంద్రత, వివిధ కోణాలలో సమగ్ర విశ్లేషణ వంటి అంశాలు కనిపిస్తాయి. వీరి పీఠికల్లో విషయ నైపుణ్యం,సునిశితత్వం ఉంటాయి.

వీరి రేడియో ప్రసంగాలు క్లుప్తంగా విషయ గాఢతతో కూడి ఉంటాయి. వీరి రచనలు అన్ని సమకాలిన వ్యవహారిక భాషలోనే ఉంటాయి వీరి రచనలు క్లుప్తంగా,నిర్దిష్టంగా,నిర్ధుష్ష్టంగా ఉంటాయి.

వీరురాసిన.తెలుగుసాహిత్యం-మరోచూపు,నూరేళ్లతెలుగునాడు,తెలుగులోతొలిసమాజకవులు,నేటి తెలుగు స్వరూప సంగ్రహంవంటి గ్రంధాలు విశ్వవిద్యాలయాల విద్యార్థులకు మరియు పరిశోధకులకు మరియుసాహితీవేత్తలకుఎంతగానోసహకరిస్తాయి.వీరు రాసిన తెలుగు సాహిత్యం-చారిత్రక నేపథ్యం అన్న రచన వీరిలోని చారిత్రక విమర్శకు చక్కని నిదర్శనంగా చూపబడుతుంది.

వీరు రాసిన తొలి నాటి తెలుగు కథానికలు అన్న గ్రంథం 1898 నుంచి 1935 వరకు గల కథానికల గురించి సమగ్రంగా వివరిస్తుంది.

వీరు రాసిన ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులుఅన్న రచన విమర్శలో కొత్త దృక్కోణం ను ప్రవేశపెట్టింది.

ఒక అంశంపై స్థానిక అంశాల ప్రభావం మాత్రమే కాక భారతీయ మరియు ప్రపంచీకరణ అంశాల ప్రభావం కూడా తార్కికంగా విశ్లేషిస్తూ రాస్తారు.

వీరు భాషా శాస్త్రం పై ,ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం పై ,సంస్కృత సాహిత్యంపైఅధ్యయనంచేశారు.

వీరు రాసిన A HISTORICAL GRAMMAR OF INSCRIPTIONAL TELUGU అన్న సిద్ధాంత వ్యాసంలో 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తెలుగు భాష పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను గురించి క్షుణ్ణంగా శాస్త్రీయంగా వివరించారు.

నేటి ఆధునిక మార్క్సిజం రచయితలు ప్రాచీన సాహిత్యం మరియు వేదాలు అనేవి నేటి కాలానికి పనికిరావని అందులో చెప్పుకోదగ్గ గొప్ప అంశాలేవీ లేవని అపహాస్యం చేసినపుడు వారికి సమాధానంగా భారతీయ భాషా శాస్త్రం మరియు అలంకార శాస్త్రాల ఆధారంగా వీరు రాసిందే రూపకం-లక్షణఅన్న వ్యాసం. ఈ వ్యాసం 2003లో ఆంధ్ర సారస్వత పరిషత్ వారి వజ్రోత్సవ సంచిక లో వెలువడింది ఇందులో 20వ శతాబ్దం ప్రారంభంలో రూపుదిద్దుకున్న వర్ణనాత్మక భాషాశాస్త్ర సిద్ధాంతాలకు ప్రాచీన వ్యాకరణ శాస్త్రంలో నమూనాలు కలవు అని నిరూపించారు.

UGC వారి ప్రాజెక్టులో భాగంగా వీరు రాసిన సిద్ధాంత వ్యాసం లో ఇందులో తెలుగుభాష నిర్మాణాత్మకత గురించిన వివరణ వుంది

వీరు శాసన భాష పరిణామక్రమం పై పరిశోధన చేశారు ఇందులో 16వ శతాబ్దం నుంచి శాసనాలు ముగిసే వరకు గల 200 శాసనాలను పరిశీలించి తెలుగు భాష చరిత్రకు ఎంతగానో ఉపకరించే అంశాలు వెలికితీశారు.

వీరు రాసిన నేటి తెలుగు స్వరూప సంగ్రహం అన్న గ్రంథం వీరిలోని వ్యాకరణ జ్ఞానం, శాసన జ్ఞానం, కావ్య జ్ఞానం, మాండలిక భాషా జ్ఞానం, వ్యవహారిక భాష జ్ఞానం కు నిదర్శనంగా నిలుస్తుంది. ఇందులో భాష అనేది సామాజిక భేదం కలది. భాష ఆధునిక కాలంలో ప్రాంతీయ మరియు సామాజిక మాండలికాలు గా మారింది. కావున మాండలిక భేదాలను చులకనగా చూడకూడదు.వీటిని అన్నింటినీ సమన్వయం చేస్తూ ఒక ప్రామాణికతను తీసుకు రావాలని చెప్పారు.

వీరు సాహిత్యంను గతితార్కిక భౌతికవాదం, మార్క్సిజం వాదం, సామాజిక సాంస్కృతిక వాదంతో ఎంతో సమగ్రంగా పరిశీలించారు. వీరు ప్రాచ్య సాహిత్యమును పాశ్చాత్య దృష్టితో ను పాశ్చాత్య సాహిత్యమును ప్రాచ్య దృష్టితోను పరిశీలించారు.

వీరి ప్రముఖ మైన రచనలు:-తెలుగు సాహిత్యం-చారిత్రక భూమిక, ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, భాషా సాహిత్యం, నూరేళ్ల తెలుగు నాడు, తెలుగు భాష సాహిత్యాల-పరిశోధన పరిణామక్రమం, భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, తెలుగు సాహిత్య వికాసం, తెలుగు సాహిత్యం-మరో చూపు, తెలుగు సాహిత్యo వచన రచనా పరిచయం, నన్నయ చారిత్రక భూమిక, తొలినాటి తెలుగు కథానికలు, శ్రీశ్రీ కవిత్రయం, నేటి తెలుగు- స్వరూప సంగ్రహాలు, రూపకం-లక్షణ మొదలైనవి.

రంగనాథ చారి గారు విస్తృత పరిజ్ఞానం, రచనా నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ వీరు తమ రచనలను ఎక్కువగా ముద్రించడానికి సుముఖత చూపలేదు.

వీరి రచనలు అన్నీ చాలావరకు ఉపన్యాసాలకే పరిమితం అయ్యాయి. వీరి రచనలను వేళ్ళమీద లెక్కించవచ్చు కానీ అందులోని శాస్త్రీయతను, విషయ జ్ఞానాన్ని, రచనా నైపుణ్యాన్ని మాటల్లో చెప్పలేం!!!!వారి మరణానంతరం వారి సంగ్రసాహిత్యం వెలుగులోకి వచ్చింది

సదా స్మరణీయ సారస్వత మూర్తి కెకె రంగనాథాచార్యులు గారు

- ఎం.కురుమయ్య యాదవ్

First Published:  16 May 2023 10:24 AM GMT
Next Story