Telugu Global
Andhra Pradesh

జనసేనకు గ్లాస్ సింబల్ ఇవ్వొద్దు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు

రెడ్ బుక్ పేరుతో అధికారులను నారా లోకేష్ బెదిరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి.

జనసేనకు గ్లాస్ సింబల్ ఇవ్వొద్దు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు
X

గుర్తింపు లేని పార్టీ జనసేనను ఈసీ ఎందుకు ఆహ్వానించిందని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఈరోజు విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ని కలసి ఆరు అంశాలపై ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్. జనసేన గుర్తింపు లేని పార్టీ అని, ఆ పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని తాము కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గ్లాస్ గుర్తు సాధారణ గుర్తు అని, సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అన్నారు.

ఇక కోనేరు సురేష్ అనే వ్యక్తి సీఈసీకి ఓ కంప్లైంట్ ఇచ్చారు. అయితే అతను టీడీపీలో కీలకంగా వ్యవహారిస్తున్నారని.. అతను చేసిన ఫిర్యాదు అవాస్తవం అని వైసీపీ నేతలు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ కంప్లైంట్ ఇచ్చారని, కానీ, అక్కడ వెరిఫికేషన్ చేశాక 87శాతం నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించామని చెప్పారు. ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టించిన కోనేరు సురేష్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ నేతలు.

రెడ్ బుక్ పేరుతో అధికారులను నారా లోకేష్ బెదిరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి. అధికారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, సీఎం జగన్ ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బోగస్ ఓట్లు లేవని, ఆ విషయంపై జిల్లా కలెక్టర్లు ఆల్రడీ నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ వారు ఉద్దేశ పూర్వకంగా వైసీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీలో రెండు చోట్ల కొంతమందికి ఓటు హక్కు ఉందని, ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఒకేరోజు జరిగేలా చూడాలని కోరారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని, తెలంగాణ ఓటర్ లిస్టులో పేరు డిలీట్ చేయించుకున్న తర్వాతే ఏపీలో ఓటర్ గా నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు విజయసాయిరెడ్డి.

First Published:  9 Jan 2024 10:02 AM GMT
Next Story