Telugu Global
Andhra Pradesh

వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. మస్క్ పేరుతో క్రిప్టో కరెన్సీ ప్రమోషన్లు

పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్‌కు గురైన విషయంపై ఇంకా వైసీపీ వర్గాలు స్పందించలేదు.

వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. మస్క్ పేరుతో క్రిప్టో కరెన్సీ ప్రమోషన్లు
X

ఏపీలోని అధికార వైఎస్ఆర్‌సీసీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. వైసీపీ అఫిషియల్ అకౌంట్‌ను దాదాపు 6 గంటల క్రితం హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తున్నది. హ్యాకర్లు అకౌంట్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకొని.. ప్రొఫైల్ పిక్‌, బయోను మార్చేశారు. లొకేషన్‌ను యూఎస్‌గా పేర్కొన్నారు. ఆ తర్వాత ఇతరులకు చెందిన ట్వీట్లను అకౌంట్లో రీ ట్వీట్ చేశారు. పలు యాప్స్‌కు చెందిన ప్రమోషన్ కంటెంట్‌ను అకౌంట్లో పోస్టు చేయడం ప్రారంభించారు.

శనివారం ఉదయం 8.22 సమయంలో ఎలాన్ మస్క్ పేరుతో ఒక ప్రమోషన్ పోస్టును కూడా పెట్టారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీని గిఫ్టులుగా పొందాలని.. అందుకోసం టెస్లా ఈవెంట్‌కు చెందిన లింక్‌ను క్లిక్ చేయమంటూ పోస్టు చేశారు. శుక్రవారం రాత్రి 8.13కి వైసీపీ అకౌంట్లో అధికారిక పోస్టు ఉన్నది. ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇక ఆ తర్వాత అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. అప్పటి నుంచి పలు రకాల ట్వీట్లు చేస్తూ అకౌంట్‌ను కంట్రోల్‌లో ఉంచుకున్నారు.

కాగా, పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్‌కు గురైన విషయంపై ఇంకా వైసీపీ వర్గాలు స్పందించలేదు. సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అకౌంట్లు యధాతథంగానే ఉన్నాయి. అటు వైపు నుంచి పార్టీ అకౌంట్ హ్యాక్ అయిన ట్వీట్ ఏమీ రాలేదు. ఉదయాన్నే సాయిరెడ్డి ట్వీట్లు చేశారు. కానీ అందులో పార్టీ అకౌంట్ హ్యాక్‌కు గురైన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

కాగా, కొన్ని రోజుల క్రితం టీడీపీ అధికారక ఖాతా కూడా హ్యాక్ అయ్యింది. అప్పుడైతే ఏకంగా టీడీపీ పార్టీ పేరును కూడా మార్చేశారు. అది వైసీపీ పనే అని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరు హ్యాక్ చేశారో తెలియాల్సి ఉన్నది.






First Published:  10 Dec 2022 4:10 AM GMT
Next Story