Telugu Global
Andhra Pradesh

వైసీపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే

ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణతోపాటు.. కొత్తగా 9 ముఖ్యమైన హామీలను ఇందులో ప్రస్తావించారు సీఎం జగన్.

వైసీపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే
X

ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాల విస్తరణతోపాటు.. కొత్తగా 9 ముఖ్యమైన హామీలను ఇందులో ప్రస్తావించారు.


మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు..

- ప్రస్తుతం రూ.3వేలుగా ఉన్న పెన్షన్ రూ.3500కు పెంపు.. (2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెంచుతారు)

- వైఎస్సార్‌ చేయూత పథకం 4 విడతల్లో రూ.75 వేలు ఇస్తుండగా దాన్ని కొనసాగించి మొత్తం 8 విడతల్లో లక్షన్నర రూపాయలు ఇస్తామన్నారు.

- అమ్మ ఒడికి అదనంగా రూ.2వేలు. మొత్తంగా అమ్మఒడి రూ.17వేలు అవుతుంది. అందులో తల్లుల చేతికి రూ.15వేలు ఇస్తారు. మిగతా 2వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి ఖర్చు చేస్తారు.

- వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.60 వేలు ఇస్తుండగా వచ్చేసారి మరో నాలుగు దఫాలు కూడా ఇచ్చి మొత్తంగా లబ్ధిదారులకు లక్షా 20వేల రూపాయల మేరకు లబ్ధి చేకూరుస్తారు.

- ఈబీసీ నేస్తం రూ.45 వేలు కాగా వచ్చే ఐదేళ్లలో కూడా దాన్ని కొనసాగించి లబ్ధిదారులకు ఒక్కొకరికి మొత్తంగా రూ.1.05 లక్షలు అందేలా చూస్తారు

- రైతు భరోసా రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు..

- వాహన మిత్ర ద్వారా ఐదేళ్లలో రూ.50 వేలు ఇచ్చారు. మరో ఐదేళ్లు దీన్ని కొనసాగిస్తారు. అంటే మొత్తంగా వాహనదారులకు ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా

మిగతా పథకాలన్నీ యధావిధిగా అమలులో ఉంటాయి. ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తూ అందులో కొన్నిటికి భారీగా నిధులు పెంచుతున్నట్టు తెలిపారు సీఎం జగన్.రాజధానుల విషయాన్ని కూడా మేనిఫెస్టోలో కీలకంగా ప్రస్తావించారు సీఎం జగన్. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిని చేస్తామన్నారు. రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతామని, అమరావతిని శాసనరాజధానిగా చేస్తామని, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని వివరించారు.

చేసేదే చెబుతా..

మేనిఫెస్టో విషయంలో ఆచితూచి ముందడుగు వేశారు సీఎం జగన్. ఇప్పుడున్న పథకాలన్నిటినీ కొనసాగిస్తూ.. అవకాశం ఉన్నచోట వాటికి కేటాయించి నిధులను భారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టోలో ప్రకటిస్తే కచ్చితంగా వాటిని అమలు చేసి తీరతామన్నారు. అందుకే ఆచరణ సాధ్యమయ్యే హామీలనే ఇస్తున్నట్టు చెప్పారు జగన్. చంద్రబాబులాగా తాను మోసపు హామీలివ్వడంలేదని, 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, ఈసారి కూడా మోసపు హామీలతోనే బాబు సూపర్ సిక్స్ అంటూ వస్తున్నారని, వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

First Published:  27 April 2024 8:39 AM GMT
Next Story