Telugu Global
Andhra Pradesh

టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ కౌంటర్లు..

రాజధానిలో పేదోడికి సెంటు భూమి ఇస్తే.. చంద్రబాబు కడుపుమంటతో అల్లాడిపోయాడని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి పేదలను ధనవంతులను చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? అని లాజిక్ తీశారు మంత్రి అంబటి.

టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ కౌంటర్లు..
X

మహానాడులో టీడీపీ మేనిఫెస్టో ప్రవేశ పెట్టిన సందర్భంగా వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. మంత్రులు, నాయకులు టీడీపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. హామీలు ఇచ్చి మోసం చేసే బాబు మళ్ళీ హామీలు ఇచ్చాడోచ్! అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు పేల్చారు. మేనిఫెస్టో పేరుతో మరో కొత్త డ్రామాకు చంద్రబాబు తెరలేపారన్నారు అంబటి.


14 ఏళ్లు సీఎంగా ఉన్న టైమ్ లో అసలు ఏ మేనిఫెస్టోని అయినా చంద్రబాబు అమలు చేశారా అని ప్రశ్నించారు మంత్రి అంబటి. రైతు రుణమాఫీ అని మోసం చేసిన సంగతి జనం ఇంకా మరచిపోలేదన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి గతంలో కూడా మోసం చేసిన చంద్రబాబు, మరోసారి అలాంటి హామీతో ప్రజల్ని బుట్టలో పడేయడానికి కొత్తగా రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల నెత్తిన మళ్ళీ వాగ్ధానాల టోపీ పెట్టాలనుకుంటున్నారని అన్నారు.

పూర్ టు రిచ్.. అప్పుడెందుకు కాలేదు..

14ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదవాడినైనా చంద్రబాబు ఎందుకు ధనవంతుడిని చేయలేదని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. మేనిఫెస్టోని భగవద్గీతగా భావించి గౌరవించిన వ్యక్తి జగన్ అని, మోసాలతో మభ్యపెట్టే 420 చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. ఈసారి ఏపీలో రాబోయేది కురుక్షేత్ర యుద్దమేనని, ఈ యుద్ధంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామన్నారు. ఖరీదైన రాజకీయాలు చేసే చంద్రబాబు, రాజకీయాలను కూడా వ్యాపారం చేశాడని మండిపడ్డారు.

కులంపేరెత్తితే చెప్పుతో కొట్టండి..

కులం పేరు ప్రస్తావనకు తెస్తే చంద్రబాబు, లోకేష్‌ ని చెప్పుతో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి. రాజధానిలో పేదోడికి సెంటు భూమి ఇస్తే.. చంద్రబాబు కడుపుమంటతో అల్లాడిపోయాడని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి పేదలను ధనవంతులను చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? అని లాజిక్ తీశారు. భవిష్యత్తులేని పార్టీ టీడీపీ అని, లోకేష్‌ కు అసలు రాజకీయ భవిష్యత్తే లేదన్నారు.

ఆ బూడిద రాసుకోండి..

టీడీపీ సైకిల్ స్క్రాబ్‌ గా మారిపోయిందని, తుక్కుతుక్కు అయిన సైకిల్‌ని మళ్ళీ తొక్కాలని ఆ పార్టీ నాయకులు తాపత్రయ పడుతున్నారని సెటైర్లు వేశారు మంత్రి అంబటి. సైకిల్‌ ని కరెంటు శ్మశానంలో తగలపెట్టి.. ఆ బూడిదను లోకేష్, చంద్రబాబు మొహాలకు రాసుకోవాలని సలహా ఇచ్చారు.

First Published:  29 May 2023 6:12 AM GMT
Next Story