చంద్రబాబుకి బానిసలవుతారు.. కాపు యువత జాగ్రత్త..
విశాఖ ఎయిర్ పోర్ట్ దాడి ఘటనలో అరెస్ట్ అయినవారిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారన్న వార్తలు అధికార వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో వైసీపీలోని కాపు వర్గం నేతలు స్పందిస్తున్నారు.
విశాఖ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్పై సింపతీ పెరిగిందని అంచనా వేస్తోంది వైసీపీ. అదే సమయంలో పవన్ విషయంలో కాపులంతా ఐక్యమైతే అది తమ పార్టీకి ఎదురుదెబ్బ అని భావిస్తోంది. అందుకే ముందస్తుగా కాపు యువతను పక్కకు లాగే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ కల్యాణ్ని నమ్మి అటువైపు వెళ్తే, కచ్చితంగా చంద్రబాబుకి బానిసలవుతారని హెచ్చరిస్తున్నారు. పవన్ కల్యాణ్, కాపులను గుంపగుత్తగా చంద్రబాబుకి అమ్మేస్తారని, అందుకే వారు ఆయనకు దూరంగా ఉండాలని చెప్పారు మంత్రి దాడిశెట్టి రాజా. అమాయకపు కాపు యువత పవన్ వలలో పడి కేసుల్లో ఇరుక్కుంటున్నారని హెచ్చరించారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ దాడి ఘటనలో అరెస్ట్ అయినవారిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారన్న వార్తలు అధికార వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని అరెస్ట్లు జరిగాయనే అపవాదు తమపై పడిందని వైసీపీ నాయకుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు హయాంలో తుని ఘటనలో కాపులు పెద్ద సంఖ్యలో అరెస్ట్ అయ్యారు. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో బాగానే కనపడింది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది తమ పార్టీకి వస్తుందేమోనని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే వైసీపీలోని కాపు వర్గం నేతలు స్పందిస్తున్నారు. పవన్ని మరోసారి టార్గెట్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. కాపు యువత పవన్కి దూరంగా ఉండాలని దాడిశెట్టి రాజా పిలుపునివ్వడం కూడా ఇందులో భాగమే.
ఇప్పటికే రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు కులాల వారీగా ఓట్లను చీల్చే పరిస్థితి వచ్చింది. కాపు వర్గం పవన్ కల్యాణ్కి దగ్గరయ్యే అవకాశాలు ఉండటంతో వైసీపీ ముందు జాగ్రత్త పడుతోంది. పవన్ని నమ్ముకుంటే ఉపయోగం లేదని, ఆయన చంద్రబాబుకి మద్దతిస్తున్నారని. పరోక్షంగా కాపుల వల్ల మళ్లీ కమ్మ నాయకుడికే ఉపయోగపడతాయనేది వైసీపీ నేతల వాదన. అందుకే కాపు యువతకు వైసీపీ నేతలు సలహాలిస్తున్నారు.