Telugu Global
Andhra Pradesh

తల్లికి గుండెపోటు.. విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమె అనారోగ్యం గురించి అవినాష్ రెడ్డికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు.

తల్లికి గుండెపోటు.. విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు
X

వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎపిసోడ్ లో పెద్ద పెద్ద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు రాకపోవడంతో రెండోసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈరోజు ఉదయం ఆయన సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది. ఆయన సీబీఐ ఆఫీస్ కి బయలుదేరారు కూడా. కానీ సడన్ గా ఇంటినుంచి ఫోన్ వచ్చిందని, తన తల్లికి అనారోగ్యంగా ఉందని కబురు పంపారని, అందుకే తాను పులివెందుల వెళ్తున్నానంటూ అవినాష్ రెడ్డి సీబీఐకి సమాచారమిచ్చారు. ఆయన కారు అటునుంచి అటే పులివెందులకు టర్న్ తీసుకుంది.

అరెస్ట్ ఖాయమేనా..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఈసారి ఖాయం అనే వార్తలొస్తున్నాయి. సుప్రీంకోర్ట్ కూడా ముందస్తు బెయిల్ కి సుముఖత చూపకపోవడంతో ఈసారి విచారణకు పిలిచి సీబీఐ అధికారులు కచ్చితంగా ఆయన్ను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరు కావడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. వాస్తవానికి ఈరోజు అవినాష్ రెడ్డి సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్ లో ఉన్న అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీస్ కి బయలుదేరి, మార్గంమధ్యలో ఫోన్ కాల్ రావడంతో సడన్ గా పులివెందులకు పయనమవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమెను హుటాహుటిన పులివెందులలోని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఆమె అనారోగ్యం గురించి అవినాష్ రెడ్డికి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల బయలుదేరారు.

First Published:  19 May 2023 6:14 AM GMT
Next Story