Telugu Global
Andhra Pradesh

రహస్య సాక్షి పేరుతో రెచ్చిపోయిన ఎల్లో మీడియా

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎల్లో మీడియా ఆలోచనకు భిన్నంగా హైకోర్టు అవినాష్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. దాన్ని తట్టుకోలేకపోతోంది ఎల్లో మీడియా. ఇందులో భాగంగానే ఈ రోజు ఒక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది.

రహస్య సాక్షి పేరుతో రెచ్చిపోయిన ఎల్లో మీడియా
X

ఎలాగైనా సరే వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిదే కీలక పాత్రగా తేల్చాలన్నది ఎల్లో మీడియా పట్టుదల. త‌ద్వారా జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లాలన్నది అసలు టార్గెట్. అందుకనే అవినాష్ అరెస్ట్ అంటూ చాలా రోజులుగా నానా రచ్చ చేస్తోంది. అయితే ఎల్లో మీడియా ఆలోచనకు భిన్నంగా హైకోర్టు అవినాష్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. దాన్ని తట్టుకోలేకపోతోంది ఎల్లో మీడియా. ఇందులో భాగంగానే ఈ రోజు ఒక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది.

అదేమిటంటే వివేకా మర్డర్ కేసులో అవినాష్ పాత్రపై ఒక రహస్య సాక్షి ఉన్నాడని సీబీఐ కోర్టుకు చెప్పిందట. ఆ రహస్య సాక్షి ఎవరన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని కూడా జడ్జీకి సీబీఐ చెప్పిందట. కోర్టు విచారణలో కూడా రహస్య సాక్షి ఎవరనే విషయాన్ని సీబీఐ చెప్పకపోతే ఇంకెప్పుడు చెబుతుంది? ఆ సాక్షి వల్లే వివేకా మర్డర్ కుట్ర తెలిసిందని జడ్జీకి సీబీఐ చెప్పిందట. ఇక్కడ విషయం ఏమిటంటే కడప ఎంపీగా అవినాష్‌ను వద్దని వివేకా పట్టుబట్టారట. షర్మిల లేదా వైఎస్ విజయమ్మను పోటీలోకి దింపాలని వివేకా గట్టిగా చెప్పారట.

పోటీ చేసేందుకు విజయమ్మ, షర్మిలలో ఒకరిని వివేకా ఒప్పించారని ఎల్లో మీడియా చెప్పింది. అవినాష్‌కు గనుక టికెట్ ఇచ్చేట్లయితే తాను టీడీపీలోకి వెళ్లిపోతానని జగన్మోహన్ రెడ్డిని వివేకా బెదిరించారట. తర్వాత హత్య జరిగిన రెండు రోజులకే అవినాష్‌కు జగన్ టికెట్ ప్రకటించారని ఎల్లో మీడియా కథనంలో చెప్పింది.

ఇక్కడే లాజిక్ లేకుండా బురదచల్లటమే టార్గెట్‌గా ఎల్లో మీడియా ఎలా పనిచేస్తోందో అర్థ‌మైపోతోంది. అసలు వైసీపీని పెట్టిందెవరు? పార్టీపై పెత్తనం ఎవరిది? పలానావాళ్ళకే టికెట్లు ఇవ్వాలని, ఇవ్వద్దని పట్టుబట్టడానికి వివేకా స్థాయి ఏమిటి? అవినాష్‌కు టికెటిస్తే తాను టీడీపీలోకి వెళ్లిపోతానని జగన్‌ను వివేకా బెదిరించటం ఏమిటో విచిత్రంగా ఉంది. పార్టీ జగన్ ది. టికెట్లు ఫైనల్ చేయాల్సింది కూడా జగనే. జగన్ టికెట్ ఇస్తేనే ఎవరైనా పోటీ చేయగలిగింది .

టికెట్ విషయంలో జగన్‌ను బెదిరించేత సీన్ వివేకాకు ఉందా? 2014లో ఎంపీగా గెలిచిన అవినాష్‌కే జగన్ 2019లో టికెట్ ఇచ్చారు. అవినాష్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నపుడే కదా వివేకా హత్యకు గురైంది. వివేకా చనిపోయిన రెండు రోజుల తర్వాత అవినాష్‌కు జగన్ టికెట్ ప్రకటించటమేంటి? వివేకానే జగన్ దయమీద పార్టీలో ఉన్నారు. అలాంటిది ఎంపీ టికెట్ విషయంలో జగన్ తల్లి, సోదరికి ఇవ్వాల‌ని వివేకా పట్టుబట్టడం ఏమిటి? వివేకా టీడీపీలో వెళ్ళిపోతానని బెదిరించిందే నిజమైతే మరి అవినాష్ గెలుపు కోసం ఎలా ప్రచారం చేశారు? ఏమిటో ఎల్లో మీడియా పైత్యం పెరిగిపోతోంది.

First Published:  28 May 2023 5:28 AM GMT
Next Story