Telugu Global
Andhra Pradesh

ఎల్లో మీడియా అస్సలు తట్టుకోలేకపోతోందా?

జగన్‌పై మంటతో ప్రత్యేకమైన కథనం అచ్చేశారు. అందులో ఏముందంటే పేదల పక్షపాతినని చెప్పుకునే జగన్ స్పెషల్ ఫ్లైట్‌లో లండన్ వెళ్ళారట. పేదలను ఉద్ధరించానని చెప్పుకునే జగన్ విలాసవంతమైన విమానంలో వెళ్ళారని ఉంది.

ఎల్లో మీడియా అస్సలు తట్టుకోలేకపోతోందా?
X

జగన్మోహన్ రెడ్డి మీద ఎల్లో మీడియా అక్కసుకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ అధినేతగా జగన్ పైన ప్రతిరోజూ బురదచల్లేస్తున్నారు. చివరకు వ్యక్తిగత విషయాలను కూడా వదిలిపట్టడంలేదు. ‘ఛార్టెర్డ్ ఫ్లైట్‌లో పేదల పక్షపాతి’ అనే హెడ్డింగ్‌తో కథనం వండివార్చింది. ఆ కథనం చదివితే ఎల్లో మీడియాలో జగన్‌పైన అక్కసు ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థ‌మైపోతుంది. కూమార్తెల‌ను చూసేందుకు జగన్ భార్యతో కలిసి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళారు.

ఇంకేముంది జగన్‌పై మంటతో ప్రత్యేకమైన కథనం అచ్చేశారు. అందులో ఏముందంటే పేదల పక్షపాతినని చెప్పుకునే జగన్ స్పెషల్ ఫ్లైట్‌లో లండన్ వెళ్ళారట. పేదలను ఉద్ధరించానని చెప్పుకునే జగన్ విలాసవంతమైన విమానంలో వెళ్ళారని ఉంది. సీఎం మాటలు వింటే ఎవరైనా కొత్తవాళ్ళు జగన్ ఎంత పేదవాడో అని భ్రమపడతారని ఎద్దేవా చేశారు. జగన్ మాటలు వింటే తనను సర్వసంగ పరిత్యాగిననో, బాబా ఆమ్టేలాగానో, అన్నా హజారే లాగే అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారని భ్రమలు పడతారని సెటైర్లు వేశారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే తాను పేదల పక్షపాతినని జగన్ చెబుతున్నది నిజమే. అంతేకానీ తాను పేదవాడినని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అంతకుముందు ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. పేదల పక్షపాతినంటే వాళ్ళ కోసం ఇచ్చిన హామీలను అమలు చేయటమే. అంతేకానీ ఎన్నికల్లో అధికారం కోసం నోటికొచ్చిన హామీలిచ్చి చంద్రబాబులా ఎగ్గొట్టడం కాదు. విలాసవంతమైన భవనాలున్నాయంటే అది జగన్ వ్యక్తిగతం. పేదల ఉద్ధరణ గురించి మాట్లాడేవాళ్ళంతా గుడెసెల్లో ఉంటూ భిక్షమెత్తుకుని బతకాలని ఎల్లో మీడియా ఉద్దేశ‌మా?

పేదలందరినీ ధనవంతులను చేస్తానని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఉంటున్నది అత్యంత విలాసవంతమైన భవనాల్లో కాదా? పేదల కోసం తన ప్రాణాలను ఇస్తానని ఎన్నోసార్లు ప్రకటించిన చంద్రబాబు ఎప్పుడైనా ఆ పని చేశారా? పేదల కోసం ప్రకటించిన హామీల్లో ఎప్పుడైనా ఒక్కటైనా సంపూర్ణంగా అమలు చేశారా? ఇదే కథనంలో జగన్ లండన్ పర్యటన వ్యక్తిగతం కావచ్చు ఖర్చులు కూడా తానే సొంతంగా భరిస్తుండచ్చు అని రాశారు. తన సొంత ఖర్చులతో లండన్ వెళితే ఎల్లో మీడియా ఏడుపేమిటో అర్థంకావటంలేదు. జగన్ ప్రభుత్వ ఖర్చుతో లండన్‌కు వెళ్ళలేదని ఒకవైపు చెబుతునే మరోవైపు విలావవంతమైన విమానంలో వెళ్ళారన్న ఏడుపు బయటపడుతోంది.

ఇక చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ప్యాసెంజర్ విమానంలో ప్రయాణించారా? చంద్రబాబు ప్రయాణాలు కూడా ఎప్పుడూ ఛార్టెడ్ ఫ్లైట్‌లోనే జరుగుతాయిక‌దా. మరప్పుడు ఇలా ఎప్పుడూ గోల చేయలేదే. అంటే చంద్రబాబు ఏమిచేసినా ఒప్పే అదే జగన్ చేస్తే తప్పుగా రాయాలని ఫిక్సయిపోయింది ఎల్లో మీడియా. అందుకనే ఇలాంటి ఏడుపుగొట్టు రాతలు రాస్తోంది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?


First Published:  7 Sep 2023 6:26 AM GMT
Next Story