Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఆఫీస్ నిర్మాణాలు అద్దెకు..!

ఇప్పుడు మరో ఉల్లంఘనకు టీడీపీ పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ హయాంలో పార్టీ ఆఫీస్ కోసం భూమిని కేటాయించిన జీవోలో .. ఆ భూమిని రాజకీయ కార్యకలాపాలకు తప్ప ఇతర అవసరాలకు వాడకూడదని స్పష్టం చెప్పారు.

టీడీపీ ఆఫీస్ నిర్మాణాలు అద్దెకు..!
X

మంగళగిరి సమీపంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. టీడీపీ హయాంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం 3.65 ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం కేటాయించుకుంది. ఇక్కడే నిర్మాణం పూర్తి చేసింది. అయితే ఈ భూమి వాగు పోరంబోకు భూమి అంటూ ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. వాగుపోరంబోకు భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు నిబంధ ఉన్నప్పటికీ వాగు భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మించడంపై ఇంకా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.

ఇప్పుడు మరో ఉల్లంఘనకు టీడీపీ పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ హయాంలో పార్టీ ఆఫీస్ కోసం భూమిని కేటాయించిన జీవోలో .. ఆ భూమిని రాజకీయ కార్యకలాపాలకు తప్ప ఇతర అవసరాలకు వాడకూడదని స్పష్టం చెప్పారు. టీడీపీ మాత్రం ఆ భూమిలో ఇతర నిర్మాణాలు చేపట్టి గదులకు అద్దెకు ఇస్తోందని వైసీపీ చెబుతోంది. ఇందుకోసం నేషనల్ హైవే పరిధిలోని భూమిని కూడా టీడీపీ ఆక్రమించినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఒక కీలక అధికారికి టీడీపీ మద్దతుగా నిలుస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

నేషనల్‌ హైవేకు సంబంధించిన భూమిని ఆక్రమించి పార్టీ ఆఫీస్‌కు అనుకునే ఏడాది క్రితం ఒక దుకాణాన్ని నిర్మించి దాన్ని మైత్రి ఎంటర్‌ప్రైజస్‌ అనే పేరుతో ఒకరికి అద్దెకు ఇచ్చిన అంశాన్ని అధికార పార్టీ ప్రస్తావిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు దుకాణాలను నిర్మించి వాటిని కూడా ఇతర వాణిజ్య అవసరాల కోసం అద్దెకు ఇచ్చారని .. ఇది భూకేటాయింపు నిబంధనలకు విరుద్దమని వైసీపీ వాదిస్తోంది. మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.

First Published:  25 Dec 2022 5:01 AM GMT
Next Story