Telugu Global
Andhra Pradesh

ఇంతకీ చంద్రబాబు ఏ 'రత్నం' తమ్ముళ్ళూ..? విజయసాయిరెడ్డి సెటైర్

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలపై రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

ఇంతకీ చంద్రబాబు ఏ రత్నం తమ్ముళ్ళూ..? విజయసాయిరెడ్డి సెటైర్
X

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు గత నెలలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయనకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు. నెలన్నర గడిచినా బెయిల్ సంగతి ఎటూ తేలకపోవడంతో టీడీపీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. ఇక చంద్రబాబు విడుదల కోసం ఎల్లో మీడియా కూడా శతవిధాలా ప్రయత్నిస్తోంది.

రాజకీయంగా క్రియాశీలకంగా లేని నాయకులు, పక్క రాష్ట్రాల నాయకుల అభిప్రాయాలు తీసుకొని.. చంద్రబాబును అరెస్టు చేయడం తగదంటూ.. పుంకానుపుంకాలుగా వార్తలు వేస్తోంది. చంద్రబాబు అరెస్టుపై అభిప్రాయాలు చెప్పేవారు కూడా చంద్రబాబు మహానుభావుడని, రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం ఏంటి? అని అభిప్రాయపడుతున్నారు.

ఇక టీడీపీ శ్రేణులు అయితే 'న్యాయానికి సంకెళ్లు' అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇంటింటికి తిరుగుతున్నారు. మచ్చలేని వ్యక్తిని, మహానుభావుడిని, రత్నం వంటి వ్యక్తిని అరెస్టు చేసి న్యాయానికి సంకెళ్లు వేశారని ప్రజలకు వివరిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా, ఈ కార్యక్రమాలకు పచ్చ మీడియా సహకరిస్తున్నా ప్రజల్లో చంద్రబాబుపై సింపతీ రాకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలపై రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందరూ చంద్రబాబు రత్నం అని పొగుడుతున్న వారే.. కానీ, ఇంతకు ఆయన ఏ రత్నమో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. 'చంద్రబాబుగారు జాతిరత్నం, దేశరత్నం' ఆయనను కాపాడుకోవాలంటూ పచ్చతమ్ముళ్లు నినాదాలిస్తారు. ఏ "జాతి"రత్నమో, ఏ "దేశ"రత్నమో, ఏ "ఖండ"రత్నమో ఏ "గ్రహ"రత్నమో ఎవరికీ చెప్పరు! కనీసం తెలుగు"దేశ" రత్నమని కూడా చెప్పుకోలేని దుస్థితి.' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

First Published:  19 Oct 2023 5:11 AM GMT
Next Story