జాకీని పీకింది లోకేష్, పరిటాలే.. - ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్
చంద్రబాబును జాకీలు పెట్టి లేపడానికే ఈనాడు రామోజీ "జాకీ రాతలు.. రాశారని, చంద్రబాబు తెస్తానన్న రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరు ఎత్తుకెళ్ళారో చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబును రామోజీరావు ప్రశ్నించాలని తోపుదుర్తి డిమాండ్ చేశారు.
![జాకీని పీకింది లోకేష్, పరిటాలే.. - ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్ జాకీని పీకింది లోకేష్, పరిటాలే.. - ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్](https://www.teluguglobal.com/h-upload/2022/11/21/427168-ycp-mla-topudurthi-prakash-reddy-fires-on-eenadu-article-on-jockey-company.webp)
"నేతలను మేపలేక జాకీ పరార్" అంటూ ఈనాడు ఇవాళ పతాక శీర్షికలో రాసిన కథనంపై అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోడానికి కారణం టీడీపీ హయాంలో ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీతలేనని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి కమీషన్ల బేరం కుదరకే జాకీ ఫ్యాక్టరీ తరలిపోయింది అన్నది వాస్తవమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ జాకీ సంస్థను ఏపీలో ఉత్పత్తి ప్రారంభించమని కోరుతూనే ఉందని చెప్పారు.
జాకీ పరిశ్రమకు అవసరమైన భూములను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వాళ్లే ముందుకు రావడం లేదని చెప్పారు. 2018లోనే ప్రహరీ గోడ పనులు మొదలుపెట్టి.. జాకీ కంపెనీ వాళ్లు ఎందుకు ఆపేశారో తెలుగుదేశం నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. జాకీ సంస్థకు భూములు ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా..కంపెనీ వాళ్లే ముందుకు రావడం లేదని వివరించారు. ఏపీలోనే కాదు, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జాకీ ఎందుకు ఉత్పత్తులు ప్రారంభించలేదని ప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపడానికే ఈనాడు రామోజీ "జాకీ రాతలు.. రాశారని, చంద్రబాబు తెస్తానన్న రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరు ఎత్తుకెళ్ళారో చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబును రామోజీరావు ప్రశ్నించాలని తోపుదుర్తి డిమాండ్ చేశారు.