Telugu Global
Andhra Pradesh

రేణుకా చౌదరి ఒక ఎండిపోయిన చెట్టు

రేణుకా చౌదరి ఏపీ ప్రజల పాలిట శత్రువు అని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ఓటేసిన వ్యక్తి రేణుకా చౌదరి అని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీకి వచ్చి అమరావతికి మద్దతు ఇవ్వడం వెనుక ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు

రేణుకా చౌదరి ఒక ఎండిపోయిన చెట్టు
X

అసలు రేణుకా చౌదరికి ఏం సంబంధం ఉందని ఏపీకి వచ్చి టీడీపీ ముసుగులో అమరావతివాదులు చేస్తున్న దండయాత్రకు మద్దతు ఇస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర మీద దండయాత్ర జరుగుతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ నడిపి ఉద్యమాన్ని ప్రశంసిస్తారా అని ప్రశ్నించారు.

రేణుకా చౌదరి ఏపీ ప్రజల పాలిట శత్రువు అని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు ఓటేసిన వ్యక్తి రేణుకా చౌదరి అని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీకి వచ్చి అమరావతికి మద్దతు ఇవ్వడం వెనుక ఉద్దేశాలు ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉంటూ చంద్రబాబు సిద్ధాంతాన్ని బలపరుస్తున్న వ్యక్తి రేణుకా చౌదరి అని, కేవలం కుల రాజకీయం కారణంగానే వీరంతా ఒకటయ్యారని విమర్శించారు.

హైదరాబాద్‌ తరహాలోనే అమరావతిలోనూ భూముల ఆధారంగా తమ కులం వారు బలపడాలన్న ఉద్దేశంతోనే వీరంతా కలిసి పార్టీలకు అతీతంగా కులపరంగా ఏకమయ్యారని మండిపడ్డారు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి రాజధాని కాదని.. అది కేవలం కమ్మ కులానికి చెందిన రాజధాని మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో మరే కులం లేదు అన్నట్టుగా వీరి వ్యవహారం ఉందన్నారు.

మరో ప్రాంతంలో అభివృద్ది వద్దు మొత్తం మా దగ్గరే ఉండాలని ఇంత బహిరంగంగా మాట్లాడుతున్న వ్యక్తులు అమరావతివాదులు మాత్రమేనన్నారు. రేణుకా చౌదరి గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదని... రేణుకా చౌదరి ఒక ఎండిపోయిన చెట్టు అని, ఆ చెట్టుకు పూలు పూయ‌వు, కాయలు కాయవు అని శివప్రసాద్‌ రెడ్డి ఫైర్ అయ్యారు.

First Published:  13 Sep 2022 1:21 PM GMT
Next Story