Telugu Global
Andhra Pradesh

రామోజీ అక్రమాలు సుప్రీంకోర్టు తీర్పుతో వెలుగులోకొస్తాయి

త్వరలో రాబోయే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రామోజీ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని సజ్జల చెప్పారు. అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. 2024 ఎన్నికలను కూడా శాసించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.

రామోజీ అక్రమాలు సుప్రీంకోర్టు తీర్పుతో వెలుగులోకొస్తాయి
X

మార్గదర్శి పేరుతో రామోజీరావు చేసిన అక్రమాలు సుప్రీంకోర్టు తీర్పుతో వెలుగులోకి వస్తాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడిన రామోజీ.. ప్రజలను మోసం చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించాడని ఆయన విమర్శించారు. ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని తెలిపారు. తాడేపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో రాబోయే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రామోజీ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని సజ్జల చెప్పారు. అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. 2024 ఎన్నికలను కూడా శాసించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబును గద్దెనెక్కించడమే లక్ష్యంగా రామోజీ దిగజారుడు రాతలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. తన పత్రికలో నీతులు వల్లెవేసే రామోజీ.. మార్గదర్శి గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై చిన్న వార్త అయినా తన పత్రికలో రాశారా అని ఆయన ప్రశ్నించారు. అందరికీ నీతులు చెప్పే రామోజీ తాను మాత్రం పాటించడం లేదని ఆయన చెప్పారు. అసలు ఏనాడూ ఆయన పత్రికలో నిష్పక్షపాతంగా వార్తలు రాయలేదని ఆయన తెలిపారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న వలంటీర్లపైనా తప్పుడు రాతలు రాశారని సజ్జల మండిపడ్డారు.

రోజుకో మాట మార్చే వ్యక్తి చంద్రబాబు

చంద్రబాబు రోజుకో మాట మార్చే వ్యక్తి అని సజ్జల చెప్పారు. వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించిన వ్యక్తి చంద్రబాబని ఆయన తెలిపారు. ఒకప్పుడు వలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని, నాలుగు ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. వలంటీర్లపై చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ విషం కక్కారని, ఇప్పుడు మాత్రం వలంటీర్లపై ప్రేమ చూపిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయని హెచ్చరించారు. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, ఆయన మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పక్షానే ఉన్నారని ఆయన తెలిపారు.

First Published:  11 April 2024 9:00 AM GMT
Next Story