Telugu Global
Andhra Pradesh

ఉగ్ర‌వాద స్థాయి దాటి ఎల్లో మీడియా బ‌రితెగింపులు..

అన్నింటా అడ్డంగా దోచేసిన చంద్రబాబు మాత్రం వీరికి హీరోలా కనిపిస్తున్నాడని విమర్శించారు. అంతా పారదర్శకంగా చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై, జగన్‌పై మాత్రం అబద్ధాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.

ఉగ్ర‌వాద స్థాయి దాటి ఎల్లో మీడియా బ‌రితెగింపులు..
X

ఎల్లో మీడియా ఉగ్రవాదం స్థాయి దాటి బరితెగించిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్‌పై రామోజీ, రాధాకృష్ణ టన్నులకొద్దీ విషం చిమ్ముతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రికలు టీడీపీ కరపత్రాలస్టేజ్‌ దాటిపోయి.. కరదీపికలుగా మారాయని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ 99 శాతం హామీలు అమలు చేస్తే.. మిగిలిన ఒక్క శాతం మీద రాస్తున్నారని మండిపడ్డారు. నాడు - నేడు పనుల్లో మొదటి దశను వదిలేసి రెండో దశలో టేకప్‌ చేస్తున్న వాటిపై రాస్తున్నారని విమర్శించారు. పూర్తయిన పనులు మాత్రం చూపించరని మండిపడ్డారు. ఇక్కడేదో ఘోరాలు జరుగుతున్నట్లు బాబు కోసం నిత్యం రోత రాతలు రాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తుంటే.. ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్న పథకాల గురించి ఒక్కటీ చెప్పడం లేదన్నారు. రామోజీ రావు అక్రమంగా ప్రజల నుంచి వచ్చిన సొమ్మునే పెట్టుబడిగా పెట్టి మహా సౌధాన్ని కట్టుకున్నాడని, వేల ఎకరాల ఫిల్మ్‌ సిటీ, వెలుగులోకి రాని అక్రమాస్తులు వంటివి అనేకం ఉన్నాయని సజ్జల చెప్పారు. రామోజీ ఏదో సచ్ఛీలుడైనట్టు ప్రవచనాలు వల్లిస్తే ఎలా అని ప్రశ్నించారు. బాబు హయాంలో జరిగిన అక్రమాలపై మాత్రం కిక్కురుమనలేదని మండిపడ్డారు. అన్నింటా అడ్డంగా దోచేసిన చంద్రబాబు మాత్రం వీరికి హీరోలా కనిపిస్తున్నాడని విమర్శించారు. అంతా పారదర్శకంగా చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై, జగన్‌పై మాత్రం అబద్ధాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.

ఆఫ్‌ చేసిన లోకేష్‌ టేప్‌ రికార్డర్‌ మళ్లీ మొదలైంది...

ఆఫ్‌ చేసిన లోకేష్‌ టేప్‌ రికార్డర్‌ మళ్లీ మొదలైందని సజ్జల ఎద్దేవా చేశారు. భయాన్ని పరిచయం చేస్తానని చెబుతున్న లోకేష్‌.. అసలు భయం, భయపడటం అనే ప్రశ్న రాజకీయాల్లో ఎందుకొస్తుందని ఆలోచించుకోవాలని చెప్పారు. నువ్వు ప్రజల్లో ఉండే మనిషివి అయితే.. ప్రజల సేవకే నీ పార్టీ ఉంటే...ఈ భయాలు..పీకడాలు ఎందుకొస్తాయని నిలదీశారు. నువ్వేం చేశావో చెప్పు... సీఎం జగన్‌ చేసిన దాంట్లో లోపమేమన్నా ఉంటే చూపించు.. టీడీపీ హయాంలో చేసిందేంటో చెప్పడానికి ఏమీ లేదు.. జగన్‌ పాలనలో లోపాలు చూపించడానికి ఏమీ లేదు.. అని తెలిపారు. అందుకే వారికి బూతులు, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం తప్ప ఇంకేమీ రావడం లేదని ఎద్దేవా చేశారు. జనం నవ్వుకోడానికి ఒక జోకర్‌ దూరం అయ్యాడనుకున్నారని, మళ్లీ వచ్చాడని చెప్పారు.

టీడీపీకి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులున్నారా?

టీడీపీ తరఫున పోటీ చేయడానికి చంద్రబాబుకు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులున్నారా? అని సజ్జల ప్రశ్నించారు. ఈ రోజుకైనా టీడీపీ విధానం ఇది.. మా పార్టీ అభ్యర్థులు వీళ్లు అని చెప్పగలిగే స్థాయిలో చంద్రబాబు లేడని ఎద్దేవా చేశారు. ప్రజల బాగోగులు చూస్తూ వారికి సంక్షేమం అందిచాం కాబట్టే జగన్మోహన్‌రెడ్డి గారికి అలాంటి ధీమా స్పష్టంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు నుంచి ప్రజల వరకూ విశ్వనీయత అనేది చేరింది కాబట్టి ముందుకు వెళ్తున్నామన్నారు. పథకాల అమలులో టీడీపీ సానుభూతిపరులకు గానీ, ఆ పార్టీవారికి గానీ ఒక్కరికైనా సంక్షేమం ఆగిందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసినందువల్లే వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు ధీమాగా వెళ్లగలుగుతున్నారని సజ్జల స్పష్టం చేశారు.

ఉండేది పక్క రాష్ట్రంలో.. పెత్తనం ఏపీలో కావాలంట..

చంద్రబాబు, లోకేష్, పవన్, రామోజీ, రాధాకృష్ణ.. అందరూ ఉండేది పక్క రాష్ట్రంలోనేనని, అయినా పెత్తనం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలనుకుంటున్నారని సజ్జల మండిపడ్డారు. వీళ్ల వ్యాపారం బాగుండాలి..రాజకీయం బాగుండాలి..రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవాలనేదే వీరి కోరికని చెప్పారు. టీడీపీ ఒక రాజకీయ పార్టీ అనేది ఎన్టీఆర్‌తోనే పోయిందని, ఇప్పుడున్నది రాజకీయ పార్టీనే కాదని తెలిపారు. వీరంతా 2024లో రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం కావడం తథ్యమని స్పష్టం చేశారు.

First Published:  27 Nov 2023 3:07 PM GMT
Next Story