Telugu Global
Andhra Pradesh

కొడాలి నాని 'అన్ స్టాపబుల్' కౌంటర్లు..

తండ్రిని చంపిన చంద్రబాబుతో షో లు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గులేదని విమర్శించారు కొడాలి నాని. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్, రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు.

కొడాలి నాని అన్ స్టాపబుల్ కౌంటర్లు..
X

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆ ఓటీటీ షో కి సంబంధించి విడుదల చేసిన టీజర్లో అన్నీ అవాస్తవాలే ఉన్నాయంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ చనిపోయి పాతికేళ్లు దాటినా.. ఇంకా ఆయన్ని షో ల పేరుతో హింసిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తండ్రిని చంపిన చంద్రబాబుతో షో లు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గులేదని విమర్శించారు కొడాలి నాని.

గతిలేక అనేకసార్లు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్టీఆర్ కు పార్టీ నడపడం చేతకాకపోతే, చంద్రబాబు బయటకు పోవాలి కానీ, ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీని లాక్కోవడమేంటని మండిపడ్డారు. ఈ షో కోసం ఎన్టీఆర్ ని మించిపోయి బాలకృష్ణ, చంద్రబాబు నటిస్తున్నారని అన్నారు. పార్టీని కాపాడినట్లు షోలు చేస్తున్న చంద్రబాబు కపట నాటక సూత్రధారి అని విమర్శించారు.

పవన్ పై రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తారు..

గాజువాక ప్రజలు 2019లో పవన్ కల్యాణ్ పై ఉమ్మేశారని, త్వరలోనే రాష్ట్ర ప్రజలంతా ఆయనపై ఉమ్మేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఘాటుగా స్పందించారు కొడాలి నాని. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న పవన్, రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చిల్లర కోసం పవన్ ఆశ పడుతున్నారని, పవన్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడు రాజధానులకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు.

గాజువాకతోపాటు ఉత్తరాంధ్రపై కక్ష పెట్టుకున్న పవన్‌, పెయిడ్‌ అమరావతి రైతులు, టీడీపీ, బీజేపీ, తోక పార్టీలతో కలిసి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పారు నాని. రాష్ట్ర ప్రజలు విశాఖ రాజధాని కావాలని కోరుతూ విశాఖ గర్జన చేస్తున్నారని అన్నారు. దీనిని భగ్నం చేయడానికే పవన్‌ ఉత్తరాంధ్ర పర్యటన పేరిట నాటకాలాడుతున్నారని విమర్శించారు.

First Published:  13 Oct 2022 2:43 AM GMT
Next Story